
జలగండం
జిల్లాకు జలగండం ముంచుకొస్తోంది.
– హెచ్చెల్సీ ఆయకట్టు గురించి పట్టించుకోని పాలకులు
– స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటున్న అధికార పార్టీ నేతలు
– జిల్లాకు నీటిని తీసుకురావడానికి పైస్థాయిలో ఒత్తిళ్లు చేయలేని దుస్థితి
– అనంత కోటాను తన్నుకుపోయిన కర్నూలు ప్రజాప్రతినిధులు
జిల్లాకు జలగండం ముంచుకొస్తోంది. తుంగభద్ర జలాశయం నుంచి కేసీ కెనాల్ వాటా 10 టీఎంసీలలో దామాషా ప్రకారం మూడు టీఎంసీలు రివర్స్ డైవర్షన్ పద్ధతిలో జిల్లాకు రావాల్సి ఉన్నా.. కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులు పైస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చి తన్నుకుపోయారు. జిల్లాకు సాగు, తాగునీటిని తీసుకురావడంలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఘోరంగా విఫలమయ్యారని చెప్పేందుకు ఇదొక్క నిదర్శనం చాలు. ఫలితంగా హెచ్చెల్సీ చరిత్రలో ఎన్నడూలేని విధంగా పంటలకు నీరివ్వలేని దుస్థితి ఈసారి ఏర్పడింది.
అనంతపురం సెంట్రల్ : తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్చెల్సీ) కింద మొత్తం 2.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గతంలో ప్రతియేటా దాదాపు లక్ష ఎకరాల వరకూ నీరందించేవారు. కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆయకట్టు బీడుగా మారుతోంది. గతేడాది మిడ్పెన్నార్ సౌత్, నార్త్ కెనాల్, తాడిపత్రి బ్రాంచ్కెనాల్ (టీడీపీ) తదితర వాటి కింద ఆయకట్టుకు నీరివ్వలేదు. ఈ ఏడాది ఏకంగా హెచ్చెల్సీ వ్యవస్థలోని మొత్తం ఆయకట్టును ఎండబెడుతున్నారు. హెచ్చెల్సీ మెయిన్ కెనాల్, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ) కింద వేలాది ఎకరాల్లో సాగు చేసిన మిరప, వరి, ఆరుతడి పంటలు ఎండిపోతున్నాయి.
లోపించిన ప్రణాళిక
టీబీ డ్యాం నుంచి ఈ ఏడాది 22 టీఎంసీల నీరు హెచ్చెల్సీకి వస్తుందని, తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు పోనూ మిగిలిన నీటిని ఆయకట్టుకు వదలాలని సాగునీటి సలహామండలి(ఐఏబీ) సమావేశంలో నిర్ణయించారు. అయితే.. వర్షాభావం వల్ల టీబీ డ్యాంలోకి ఆశించిన స్థాయిలో నీరు రావడం లేదు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఇప్పుడు కూడా ఆయకట్టుకు నీటిని విడుదల చేయవచ్చుననే అభిప్రాయాన్ని సాగునీటి రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం హెచ్చెల్సీకి మొత్తం 10 టీఎంసీలు వచ్చే అవకాశముంది. దీంతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం(2005)లో జారీ చేసిన జీవో మేరకు కేసీ కెనాల్ వాటా నీరు జిల్లాకు రావాలి.
ప్రస్తుతం దామాషా ప్రకారం మూడు టీఎంసీలు రావాల్సి ఉంటుంది. అలాగే శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకానికి తొమ్మిది టీఎంసీలు కేటాయించారు. శ్రీశైలంలో నీటి నిల్వ పడిపోకుండా చర్యలు తీసుకుంటే మరింత ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశముంది. ఈ లెక్కన 22 నుంచి 25 టీఎంసీల నీటిని జిల్లాకు తీసుకొచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. గతంలో హెచ్చెల్సీకి మాత్రమే 16 టీఎంసీలు వచ్చిన సమయంలోనూ తాగునీటికి పోనూ మిగిలిన నీటిని పంటలకు ఇచ్చారు. ఈసారి అధికారపార్టీ ప్రజాప్రతినిధుల చేతకానితనం వల్ల ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటికే విడపనకల్లు ప్రాంతంలో జీబీసీ కింద వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి.
అనంత రైతులకు సీఎం షాక్
జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో జిల్లాకు కేటాయించిన కోటా కన్నా అధిక నీటిని తీసుకురావడానికి అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులు కషి చేయాలి. ముఖ్యమంత్రి స్థాయిలో తుంగభద్రబోర్డు, కష్ణా రివర్బోర్డు అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి హెచ్చెల్సీ, హంద్రీనీవా ద్వారా వీలైనంత ఎక్కువ నీటిని తేవడానికి ప్రయత్నించాలి. కానీ ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. వేరుశనగ పంట ఎండిపోకుండా కాపాడతానంటూ గత నెలాఖరులో జిల్లాకు వచ్చి హడావుడి చేసిన ముఖ్యమంత్రి.. చివరకు కేసీకెనాల్ వాటా నీటిని కూడా కర్నూలుకు ఇచ్చి అనంత రైతులకు అన్యాయం చేశారు. కేసీకెనాల్ డైవర్షన్ నీటి వాటాను కర్నూలుకు ఇవ్వాలని ఆగస్టు 27న ఈఎన్సీ వెంకటేశ్వరరావు తుంగభద్ర సెక్రటరీకి లేఖ రాశారు. 2.6 టీఎంసీలను విడుదలచేయాలని అందులో పేర్కొన్నారు. అదే నెల 29 నుంచి నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు. దీన్నిబట్టే అనంత రైతులపై సీఎంకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతోంది.
జిల్లా ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు : అనంతవెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
జీబీసీ కింద ఆయకట్టులో పంటలు పూర్తిగా ఎండిపోయాయి. రైతులకు రూ.250–300 కోట్ల మేర పెట్టుబడి నష్టం వాటిల్లింది. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు వారికి మరింత నష్టాన్ని చేకూరుస్తున్నాయి. కేసీకెనాల్ డైవర్షన్ కింద జిల్లాకు హక్కుగా రావాల్సిన 3.3 టీఎంసీలను కర్నూలుకు ఎలా కేటాయించారో సమాధానం చెప్పాలి. హెచ్చెల్సీతో పాటు హంద్రీ–నీవా నీళ్లను ఇష్టానుసారం చెరువులకు, కాలువలకు పాలెగాళ్లలాగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అనంతలో పంటలను కాపాడేందుకు వచ్చిన ముఖ్యమంత్రి జిల్లాకు హక్కుగా రావాల్సిన నీటిని కర్నూలుకు కేటాయించాలని ‘అనంత’ నుంచే ఉత్తర్వులు ఇచ్చి జిల్లా రైతులకు తీరని అన్యాయం చేశారు. ఈ ఏడాది ఆయకట్టు కింద పంట నష్టానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.