భార్య ఎదుటే రెండో పెళ్లి

భార్య ఎదుటే రెండో పెళ్లి - Sakshi


అడ్డుకోబోయిన భార్యా పిల్లలను చంపుతానన్న యువకుడు



 హైదరాబాద్: ఒంటరిగా ఉన్న మహిళకు ఉపాధి కల్పిస్తానని నమ్మించి.. అప్పటికే భార్య ఉన్నప్పటికీ ఆమెను పెళ్లి చేసుకున్నాడో ప్రబుద్ధుడు. దీంతో మొదటి భార్య పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం... దుర్గానగర్‌కు చెందిన డయానా మూడేళ్ల క్రితం ఆటో డ్రైవర్ మోసెస్ విక్టర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. రెండు నెలల క్రితం మోసెస్ హారిక అనే మహిళను ఇంటికి తీసుకొని రావడంతో ఇంట్లో గొడవ జరిగింది. శనివారం అదే మహిళను ఇంటికి తీసుకొచ్చి భార్య ఎదుటే తాళి కట్టాడు. అడ్డుకోబోయిన డయానాను గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించడమే కాకుండా పిల్లలను కూడా చంపుతానని బెదిరించాడు. దీంతో డయానా, ఆమె బంధువులు వారిద్దరినీ పోలీసులకు అప్పగించారు.



పోలీసుల విచారణలో హారిక తనకు ఉపాధి కల్పిస్తానని నమ్మించాడని, మూడేళ్ల వయసుగల తన కూతుర్ని ఎవరికో అమ్మేశాడని చెప్పింది. తన బిడ్డను ఇప్పించమని వేడుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు తనకు న్యాయం చేయాలని కోరితే వివాహం చేసుకున్నాడని వివరించింది. డయానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top