వింటే సరి.. కాదంటే బదిలీ | Leading party leaders riding on district officials | Sakshi
Sakshi News home page

వింటే సరి.. కాదంటే బదిలీ

Jul 13 2017 2:06 AM | Updated on Aug 10 2018 8:26 PM

వింటే సరి.. కాదంటే బదిలీ - Sakshi

వింటే సరి.. కాదంటే బదిలీ

అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, నేతలు జిల్లా అధికార యంత్రాంగంపై సవారీ చేస్తున్నారు.

జిల్లా అధికారులపై సవారీ చేస్తున్న అధికారపార్టీ నేతలు
తాము చెప్పినట్టే వినాలంటూ బెదిరింపులు
కలెక్టర్‌ సుజాతశర్మకూ  తప్పని బదిలీ
ఇప్పుడు ఇరిగేషన్‌ ఎస్‌ఈ శారద వంతు..
అక్రమాలకు పాల్పడితే సస్పెన్షన్‌ వేటు
అంతర్మథనంలో అధికారులు


ఒంగోలు: అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, నేతలు జిల్లా అధికార యంత్రాంగంపై సవారీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ మొదలుకొని కింది స్థాయి అధికారుల వరకు తాము చెప్పిందే వినాలంటూ ఆదేశిస్తున్నారు. కాదంటే బదిలీ తప్పదంటూ బెదిరిస్తున్నారు. తమ మాట వినకపోతే శంకరగిరి మాన్యాలే.. అంటూ హెచ్చరిస్తున్నారు.  

నిజాయితీగల అధికారిగా పేరున్న కలెక్టర్‌ సుజాతశర్మను ఇక్కడి అధికార పార్టీ నేతలు నానా ఇబ్బందులకు గురి చేశారు. తాము చెప్పిన అక్రమాలల్లా చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. వారి అక్రమాలకు ఏ మాత్రం తలుపకపోవడంతో పట్టుపట్టి మరీ ఆమెను బదిలీ చేయించారు. తాజాగా ఇరిగేషన్‌ ఎస్‌ఈ శారదదీ అదే పరిస్థితి. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు స్థలాన్ని టీడీపీ జిల్లా కార్యాలయానికి ఇవ్వలేదంటూ టీడీపీ జిల్లా ముఖ్యనేత అక్కసు పెంచుకున్నారు. పలు రకాలుగా ఒత్తిడి తెచ్చినా ఆమె ససేమిరా అనడంతో ఇరిగేషన్‌ మంత్రి స్థాయిలో ఒత్తిడి తెచ్చి బదిలీ చేయించారు. ఇక జిల్లాలో కింది స్థాయి అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు చేయడమా... లేదా బదిలీపై వెళ్లడమా.. తప్ప వేరే మార్గం లేదు. నేతలు చెప్పినట్లు చేసి బలిపశువులుగా మారిన అధికారులూ లేకపోలేదు. దీంతో ఈ జిల్లాలో ఉద్యోగం మాకొద్దు బాబోయ్‌ అంటూ బెంబేలెత్తిపోతున్నారు అధికారులు.

తాము చెప్పిన పనులల్లా చేయలేదంటూ అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు జిల్లా కలెక్టర్‌గా ఉన్న సుజాతశర్మపై అక్కసు పెంచుకున్నారు. ఆమె తమ పనులు చేయడం లేదంటూ పదే పదే ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ అక్రమాలు అడ్డుకట్ట వేయడాన్ని జీర్ణించుకోలేని నేతలు పట్టుపట్టి ఆమెను బదిలీ చేయించారు.   

తాజాగా ఇరిగేషన్‌ ఎస్‌ఈ శారద బదిలీ వ్యవహారం ఓ ఉదాహరణ. ఎన్‌ఎస్‌పి స్థలాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంకు ఇచ్చేందుకు అనుమతినివ్వలేదన్న అక్కసుతో అధికార పార్టీ నేత ఆమెను పట్టుపట్టి బదిలీ చేయించారు. తొలుత బెదిరించినా శారద వినలేదు. సదరు స్థలంలో ఇరిగేషన్‌ కార్యాలయాన్ని నిర్మించుకుంటున్నామంటూ తేల్చి చెప్పారు. దీంతో ఆగ్రహించిన సదరు నేత ఇరిగేషన్‌ మంత్రిపై ఒత్తిడి తెచ్చి ఆమెను బదిలీ చేయించారు. ఈ ఘటన జిల్లా కలెక్టర్‌ మొదలుకొని అధికార వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

వెలిగొండ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించలేదన్న అక్కసుతో ఇటీవల ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ఎస్‌ఈ వెంకటరమణను పట్టుపట్టి మరీ బదిలీ చేయించారు.

జడ్పీ చైర్మన్‌ ఈదర హరిబాబు గొడవలో సుప్రీంకోర్టు అంక్షితలు వేయడంతో అప్పటి జడ్పీ సీఈఓ ప్రసాద్‌ పని చేయలేక సెలవు పెట్టి వెళ్లిపోయాడు.

అద్దంకిలో అధికార పార్టీ వర్గవిభేదాల నేపథ్యంలో అధికారులు పని చేయలేని పరిస్థితి నెలకొంది. అద్దంకి సిఐ బేతపూడి ప్రసాద్‌ను ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ పట్టుపట్టి బదిలీ చేయించారు. ఈయనతో పాటు అద్దంకి ఆర్‌డబ్లు్యఎస్‌ ఏఈ ఏపీఎం సైమన్, బల్లికురవ తహశీల్దార్, మెప్మా అధికారిని ఇక్కడి నుంచి సాగనంపారు.

కందుకూరు మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావును తమ మాట వినడం లేదంటూ ఎమ్మెల్యే పోతుల రామారావు పట్టుపట్టి బదిలీ చేయించారు.   

ఇక అధికార పార్టీ నేతలు చెప్పిదల్లా చేసి దెబ్బతిన్న అధికారులకూ కొదువ లేదు. రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖ మొదలుకొని అన్ని శాఖల పరిధిలో కొందరు అధికారులు అధికార పార్టీ నేతలు చెప్పిన అక్రమాలల్లా చేశారు. ఉన్నతాధికారుల  విచారణలో అక్రమాలు బయటపడి వారు సస్పెండ్‌ అయి బలి పశువులుగా మారారు.

మార్కాపురం అధికార పార్టీ నేత భూసెటిల్‌మెంట్‌లో కీలకభూమిక పోషించిన మార్కాపురం డీఎస్పీ శ్రీహరిబాబు, ఎస్సై సుబ్బరావులు సస్పెండ్‌ అయ్యారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తింది.

చీరాల టీడీపీ నేత ఆదేశాల మేరకు అక్రమాలకు పాల్పడిన ముగ్గురు సీఐలతో పాటు పలువురు అధికారులు సస్పెండ్‌ కావడమే కాకుండా వీఆర్‌కు వెళ్లారు.

ఒంగోలు తహశీల్దారు శ్రీకాంత్‌ కేధారనా«థ్‌ డిసెంబర్‌ నెలలో సస్పెండ్‌ అయ్యారు. చెరువుకొమ్ముపాలెం భూమికి సంబంధించి పాస్‌బుక్‌లు మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారని అప్పటి జిల్లా కలెక్టర్‌ ఆయన్ను సస్పెండ్‌ చేశారు. టంగుటూరుకు చెందిన తహశీల్దార్‌ కామేశ్వరరావును ఇన్‌చార్జిగా నియమించగా ఆయన పని చేయలేక వెళ్లిపోయారు.

కొత్తపట్నం తహశీల్దార్‌ రవిబాబును సైతం అప్పటి కలెక్టర్‌ సుజాతశర్మ సస్పెండ్‌ చేశారు. 115 ఎకరాల భూమిని 13 మందికి ఆన్‌లైన్‌ చేశారన్న కారణంతో ఈయన్ను సస్పెండ్‌ చేశారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. జిల్లా కలెక్టర్‌ స్థాయి అధికార పార్టీ నేతలకు తలొగ్గి పని చేస్తుండటంతో జిల్లాలో కింది స్థాయి అధికారుల పరిస్థితి మరింత ఆధ్వానంగా మారింది. వారిలో అంతర్మథనం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement