జిల్లాలో నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియాల నిర్మాణం


ఏలూరు రూరల్‌ :  జిల్లాలో 4 గ్రీన్‌ ఫీల్డ్స్‌ ఇండోర్‌ స్టేడియంల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్‌ఏ అజీజ్‌ చెప్పారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ  భీమడోలు (జెడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్‌), తాడేపల్లిగూడెం (ఎయిర్‌పోర్ట్‌ స్థలం), తణుకు (జెడ్పీహెచ్‌ఎస్‌), మొగల్తూరు (జెడ్పీహెచ్‌ఎస్‌) పాఠశాల ఆవరణలను ఎంపిక చేశామన్నారు. ఈ ప్రాంతాల్లో అనువైన స్థలం ఉన్నందునే అధికారులు నాలుగు సెంటర్లను ఎంపిక చేశారన్నారు. ఇందులో 25 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పుతో 9 మీటర్ల ఎత్తున మల్టీపర్పస్‌ అవసరాల కోసం ఇండోర్‌ స్టేడియంలు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఒక్కో స్టేడియం నిర్మాణానికి రూ. 2.50 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చు చేస్తారన్నారు. జూలై రెండోవారంలో ఈ ప్రాంతాలను శాప్‌ అధికారులు పరిశీలించి వెళ్లారన్నారు. 

నిరుద్యోగ పీడీ, పీఈటీలతో శిక్షణ 

ఉద్యోగం లేని ఫిజికల్‌ డైరెక్టర్లు(పీడీ) వ్యాయామ ఉపాధ్యాయ (పీఈటీ)లను గ్రామాల్లో క్రీడా శిక్షకులుగా నియమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని అజీజ్‌ చెప్పారు. ఉత్సాహం, ఆసక్తి గల వారు జిల్లా క్రీడాప్రాధికార సంస్థకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం 98663 17326 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top