ఏలూరు (ఆర్ఆర్ పేట) : ఉపాధ్యాయులను డీఈవో బెదిరించి మానసికంగా ఆందోళన కలిగించే విధంగా వ్యవహరించడాన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. స్థానిక ఆంధ్ర జాతీయ మహావిద్యాలయం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ సంఘాల సమావేశం నిర్వహించారు.
డీఈవో వైఖరిపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
Aug 18 2016 11:47 PM | Updated on Sep 4 2017 9:50 AM
ఏలూరు (ఆర్ఆర్ పేట) : ఉపాధ్యాయులను డీఈవో బెదిరించి మానసికంగా ఆందోళన కలిగించే విధంగా వ్యవహరించడాన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. స్థానిక ఆంధ్ర జాతీయ మహావిద్యాలయం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులంతా మాట్లాడుతూ టీఎన్ఐటీ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖామంత్రి ప్రకటిస్తే పరీక్ష రాయడానికి పేర్లు నమోదు చేసుకోవాలని బెదిరించడం, బేస్మెంట్ పరీక్షను నిర్వహించనని హామీ ఇచ్చి బేస్మెంటును నిర్వహించడం, మార్కులు ఆన్లైన్ చేయాలని ఒత్తిడి చేయడం, బడి గంటలు పేరుతో విద్యాశాఖను బజారుపాలు చేయడం, పాఠశాలల్లో అకడమిక్ క్యాలెండర్కు భిన్నంగా పాఠశాల సమయాన్ని పెంచి క్రీడలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించమని ఒత్తిడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. పాఠశాల నిర్వహణను స్కూల్ క్యాలెండర్ ప్రకారమే నిర్వహించాలన్న డీఈవో తన వైఖరి మార్చుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని తాలూకా కేంద్రాల్లో శుక్రవారం సాయంత్రం నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఏలూరులోని ఆంధ్ర జాతీయ గాంధీ విద్యాలయం, తాడేపల్లిగూడెంలో జెడ్పీ ఉన్నత పాఠశాల, తణుకులో జెడ్పీ ఉన్నత పాఠశాల, భీమవరంలో పీఎస్ఎం బాలికల ఉన్నత పాఠశాల, పాలకొల్లులో బీఆర్ఎంవీ హైస్కూలు, నరసాపురంలో టేలర్ హైస్కూల్, నిడదవోలులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జంగారెడ్డిగూడెంలో జెడ్పీహెచ్ స్కూల్, చింతలపూడిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తదితర ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో యూటీఎఫ్ నాయకులు షేక్ సాబ్జీ, బి.జయకర్, బి.గోపిమూర్తి, ఏపీటీఎఫ్ 1938 జి.కృష్ణ, పీఆర్టీయూ కేవీవీ సుబ్బారావు, డీటీఎఫ్ కె.నరహరి, బీటీఎ జి.వెంకటేశ్వరరావు, పీఈటీ ఎంఎన్ శ్రీనివాస్, ఆపస్ రాజకుమార్, ఆప్టా ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement