అగ్రిగోల్ సంస్థ బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ ధ్వజమెత్తారు.
అనంతపురం అర్బన్: అగ్రిగోల్ సంస్థ బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక నీలం రాజశేఖర్రెడ్డి భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన దాని కంటే ఆ సంస్థ ఆస్తుల విలువ ఎక్కువగా ఉన్నప్పటికీ సమస్య పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. సంస్థ ఆస్తులను రాష్ట్ర మంత్రివర్గంలోని కొందరు తక్కువ ధరకే ఎగరేసుకు పోయేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే న్యాయం చేయాలనే డిమాండ్తో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరావు ఆధ్వర్యంలో ఆగస్టు 16న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి చేపట్టిన బస్సుయాత్ర గురువారం అనంతపురం జిల్లాలో ప్రవేశిస్తుందన్నారు. 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తుందన్నారు. 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నగరంలో ర్యాలీ, సాయంత్రం 4 గంటలకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ ఉంటుందన్నారు.