అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు | action Will taken on Corruption | Sakshi
Sakshi News home page

అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు

Aug 28 2016 9:19 PM | Updated on Sep 22 2018 8:22 PM

ఇండోర్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తున్న ప్రజాప్రతినిధులు - Sakshi

ఇండోర్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తున్న ప్రజాప్రతినిధులు

మహబూబ్‌నగర్‌ అర్బన్‌ : సబ్‌స్టేషన్లలో ఆపరేటర్ల నియామకానికి డబ్బులు తీసుకోవద్దని, అవినీతికి పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామని జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు.

– జెడ్పీ చైర్మన్‌ భాస్కర్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌
– జిల్లాలోనే మొదటి ఇండోర్‌ సబ్‌స్టేషన్‌
మహబూబ్‌నగర్‌ అర్బన్‌ : సబ్‌స్టేషన్లలో ఆపరేటర్ల నియామకానికి డబ్బులు తీసుకోవద్దని, అవినీతికి పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామని జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. స్థానిక జెడ్పీ ఆవరణలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ ఇండోర్‌ సబ్‌స్టేషన్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో లక్షలాది రూపాయలు తీసుకొని విద్యుత్‌శాఖలో కాంట్రాక్ట్‌ సిబ్బందిని నియమించేవారని, తమ ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి పలికిందని అన్నారు. రూ.4.5 కోట్లతో నిర్మించిన ఇండోర్‌ సబ్‌స్టేషన్‌ జిల్లాలోనే మొదటిదని, దీనివల్ల స్థలంతోపాటు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కూడా తక్కువ అవసరం అవుతాయన్నారు.
 
   పట్టణంలోని చాలా ప్రాంతాల్లో ఓవర్‌లోడ్‌ వల్ల లోవోల్టేజీ సమస్య వచ్చేదని, ఈ సబ్‌స్టేషన్‌ వల్ల సరఫరా మెరుగు పడుతుందన్నారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ సరఫరా అయిందని, డిసెంబర్‌ నాటికి 14గంటలు ఇస్తామన్నారు. విద్యుత్‌ ఎస్‌ఈ కె.రాముడు మాట్లాడుతూ ఇండోర్‌ సబ్‌స్టేషన్‌లో తెలంగాణ చౌరస్తా, రైల్వేస్టేషన్, స్టేడియం, కలెక్టరేట్‌ ఏరియాల్లో నాలుగు ఫీడర్లు ఏర్పాటు చేశామని అన్నారు. ఎమ్మెల్యే ప్రతిపాదనల మేరకు విద్యుత్‌ భవన్‌ వెనుక, వీరన్నపేట, బండమీదిపల్లిలో సబ్‌స్టేషన్ల ఏర్పాటునకు కషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజేశ్వర్, టీఆర్‌ఎస్‌ నాయకులు రాజేశ్వర్‌గౌడ్, కొరమోని వెంకటయ్య, బురుజు సుధాకర్‌రెడ్డి, డీఈ నవీన్‌కుమార్, సివిల్‌ ఈఈ నిర్దోష్‌రెడ్డి, టౌన్‌ ఏడీఈ యశోద, పట్టణ ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement