
బాలాజీ అశోక్ గరిబీ(ఫైల్)
సాక్షి, హైదరాబాద్: బస్టాప్లో అమ్మాయిలను కను సైగలతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఓ ఆకతాయి. ప్రతిరోజు అమ్మాయిలను తన వెంట రమ్మని వేధిస్తున్నాడు. విషయం తెలిసిన పేట్బషీరాబాద్ డివిజన్ షీ టీమ్ బృందం సభ్యులు ఆ ఆకతాయిని సోమవారం వల పన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చింతల్ షా థియేటర్ సమీపంలో ఉన్న బస్టాప్లో గత కొంత కాలంగా భగత్సింగ్ నగర్కు చెందిన బాలాజీ అశోక్ గరిబీ(26) బస్టాప్లో నిలబడే మహిళలు, యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు.
ఈ విషయంపై పలువురు షీ టీమ్స్ డీసీపీ అనసూయ, అడిషనల్ డీసీపీ నతానియల్కు ఫిర్యాదు చేశారు. దీంతో పేట్బషీరాబాద్ డివిజన్ షీ టీమ్స్ ఏఎస్సై శ్రీనివాస్కు సదరు ఫిర్యాదును పరిశీలించమని ఆదేశించారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బస్టాప్లో షీ టీమ్ బృందం మాటు వేశారు. ఫిర్యాదులో పేర్కొన్న విధంగానే అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని స్వయంగా గమనించారు. అశోక్ గరిజీని అదుపులోకి తీసుకొని జీడిమెట్ల పిఎస్కు అప్పగించారు.