రూ. 140 కోట్లు దోచేశారు | In Uttar Pradesh Rs 140 Crore Robbed From Jewellery Shop | Sakshi
Sakshi News home page

రూ. 140 కోట్లు దోచేశారు

Oct 24 2018 5:54 PM | Updated on Oct 24 2018 5:54 PM

In Uttar Pradesh Rs 140 Crore Robbed From Jewellery Shop - Sakshi

ఐదేళ్ల క్రితం మూసి వేసిన షాప్‌లో ఇంత భారీ దొంగతనం జరగడం అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది

లక్నో : కాన్పూర్‌లో చోటు చేసుకున్న ఓ దొంగతనం పోలీసులతో పాటు జనాలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. బిర్హానా రోడ్‌లో ఉన్న ఓ జ్యూవెలరి షాప్‌లో దాదాపు 140 కోట్ల రూపాయల విలువ చేసే సొత్తు చోరికి గురయినట్లు తెలిసింది. అయితే ఐదేళ్ల క్రితం మూసి వేసిన షాప్‌లో ఇంత భారీ దొంగతనం జరగడం అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వివరాలు.. పార్టనర్‌ల మధ్య విబేధాలు తలెత్తడంతో బిర్హానా రోడ్డులో ఉన్న ఈ జ్యూవెలరి షాప్‌ని ఐదేళ్ల క్రితం మూసి వేశారు. ఈ వివాదం గురించి కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితమే కోర్టు పోలీసలు అధ్వర్యంలో షాప్‌ను ఒపెన్‌ చేయవచ్చంటూ ఆదేశించింది. దాంతో మరి కొద్ది రోజుల్లోనే షాప్‌ను తిరిగి తెరవాలని భావిస్తుండగా ఈ దొంగతనం చోటు చేసుకుంది.

దొంగలు షాప్‌ నుంచి 10 వేల క్యారెట్ల విలువైన వజ్రాలు, 500 కేజీల వెండి, 100 కేజీల బంగారంతో పాటు 5 వేల క్యారెట్ల విలువ గల ఆభరణాలు దోచుకెళ్లినట్లు తెలిసింది. వీటితో పాటు షాప్‌కు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్లను కూడా తస్కరించినట్లు సమాచారం. షాప్‌ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టుగా తెలిపారు. షాప్‌ చుట్టు పక్కల ఉన్న సీసీటీవీ కెమరాలను పరిశీలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement