మద్యం మత్తులో మృగంలా మారి

Uncle killed a six years old baby in Vijayawada - Sakshi

విజయవాడలో ఆరేళ్ల పాపను మేడపై నుంచి పడేసిన చిన్నాన్న

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడ సెంట్రల్‌): మద్యం మత్తులో రక్తసంబంధం మరిచి మృగంలా మారాడు. ఏం చేస్తున్నానన్న విచక్షణ మరిచి అన్న కూతురిపై చిన్నాన్నే ఘాతుకానికి ఒడిగట్టాడు. అన్నా వదినలపై కోపంతో చిన్నారిని కర్కశంగా మేడపై నుంచి కిందకి పడేశాడు. విజయవాడ వాంబే కాలనీలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే... వాంబేకాలనీ సీ బ్లాకుకు చెందిన కొండ్రాజు శ్రీదేవి, యేసురాజు దంపతులకు ముగ్గురు పిల్లలు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ప్రార్థన పెట్టుకునేందుకు శ్రీదేవి ఇల్లు శుభ్రం చేసి బయటకు వెళ్లింది.

ఇంతలో ఆమె మరిది కృష్ణ(28) మద్యం తాగొచ్చి ఆ మత్తులో ఇల్లు మొత్తం అన్నం మెతుకుల్ని పడేశాడు. ఇదేం పనని వదిన మందలించగా.. మద్యం మత్తులో ఉన్న కృష్ణ నన్నే తిడతావా! అంటూ బూతు పురాణం అందుకున్నారు. ఇంతలో అన్నయ్య యేసురాజు వచ్చి కృష్ణపై చేయి చేసుకున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కృష్ణ ఇంటి బయట ఉన్న అన్న పెద్ద కూతురు జానకి(6)ని వారుంటున్న రెండంతస్తుల భవనం నుంచి కిందకు పడేశాడు. దీంతో జానకి తల వెనుక భాగంలో తీవ్రగాయాలు కాగా.. చెవుల నుంచి రక్తం రావడంతో 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top