అదుపు తప్పి ద్విచక్రవాహనం బోల్తా
ఒకరు మృతి
మరొకరికి తీవ్రగాయాలు
చిన్నమండెం(రాయచోటి రూరల్) : చిన్నమండెం మండల పరిధిలోని పడమటికోన గ్రామం నాగూరివాండ్లపల్లెలో ఆదివారం సాయంత్రం అదుపు తప్పిన ద్విచక్రవాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో దేవగుడిపల్లెకు చెందిన ఎన్. కాళేశ్వరబాబు(24) అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు పడమటికోనకు చెందిన ఏ.వెంకటేష్(22) తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. డిగ్రీ చదువుతున్న సమయంలో కాళేశ్వరబాబు, వెంకటేష్లు స్నేహితులు. వీరు ద్విచక్రవాహనంలో చిన్నమండెం వైపు నుంచి కలిబండ వైపు బయలుదేరారు.
మార్గమధ్యంలో నాగూరివాండ్లపల్లెలో ఉన్న మలుపు వద్ద మీ సేవ ఎదురుగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బండరాతిని ఢీ కొన్నారు. దీంతో తలకు తీవ్రగాయమైన కాళేశ్వర మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన వెంకటేష్ను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నైకు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. చిన్నమండెం ఏఎస్ఐ నాగరాజ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.