ఐఫోన్‌ జాగ్రత్త!

Phone Snatchers New Target Apple I phones in Hyderabad - Sakshi

సిటీలో కొట్టేస్తారు..చైనాలో అమ్మేస్తారు

చోరీల వెనుక అంతర్జాతీయ ముఠా

నగరంలో సాధారణ దొంగల చేతివాటం  

ఖరీదు చేసేది వ్యవస్థీకృత వ్యాపారులు

ఆపై రిటర్న్‌ మాల్‌ ముసుగులో విదేశాలకు స్మగ్లింగ్‌

రష్యాకు చెందిన హ్యాకర్ల సాయంతో బాధితులకే ఎర

వారి నుంచే వివరాలు సంగ్రహించి ఫోన్లు అన్‌లాక్‌

చైనా, రష్యాల్లో ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న గ్యాంగ్‌

బాధితుల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే అధికం

అందరూ ముచ్చటగా కొనుక్కునే ఐఫోన్లు అంతర్జాతీయ ముఠాలకు టార్గెట్‌ అవుతున్నాయి. వాటిని లోకల్‌గా తస్కరించి విదేశాలకు తరలించేస్తున్నారు. తర్వాత సాంకేతికంగా ఆపిల్‌ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను బాధితుడి నుంచే సంగ్రహించి, ఫోన్లను అన్‌లాక్‌ చేసి తిరిగి ఆన్‌లైన్‌లో విక్రయిచేస్తున్నారు. ఇలాంటి ఓ అంతర్జాతీయ ముఠా వ్యవహారాలపై సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఉప్పందింది. వ్యవస్థీకృతంగా దందా సాగిస్తున్న వీరికి చెక్‌ పెట్టడానికి పోలీసుఅధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గడిచిన నెలన్నర రోజుల్లో ఏడుగురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఈ తరహా గ్యాంగ్‌ బారినపడి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించగా.. గురువారం పంజగుట్టకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మరో బాధితుడిగా మారానంటూపోలీసుల వద్దకు వచ్చారు. సెక్యూరిటీ పరంగా ఎంతో శక్తిమంతమైనదిగా పేరొందిన ‘ఐఫోన్‌’ హ్యాకింగ్‌ వెనుక అంతర్జాతీయంగా పెద్ద వ్యవహారమే జరుగుతోంది.

సాక్షి, సిటీబ్యూరో: ఐఫోన్లను టార్గెట్‌గా చేసుకుని వాటిని తస్కరించి, సాంకేతికంగా యూపిల్‌ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను బాధితుడి నుంచే సంగ్రహించి, అన్‌లాక్‌ చేసి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న ఓ అంతర్జాతీయ ముఠా వ్యవహారాలపై సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఉప్పందింది. వ్యవస్థీకృతంగా దందా సాగిస్తున్న వీరికి చెక్‌ చెప్పేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గడిచిన నెలన్నర రోజుల్లో ఏడుగురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఈ తరహా ముఠాల బారినపడి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించగా... గురువారం పంజగుట్టకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

చోరీ చేసేది లోకల్‌ స్నాచర్లే...
ఈ అంతర్జాతీయ ముఠాలు దళారుల ద్వారా స్థానికంగా ఉంటున్న దొంగలతోనే ఐఫోన్లు చోరీ చేయిస్తున్నాయి. పంజగుట్టకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి డ్యూటీలో భాగంగా బెంగళూరుకు వెళ్లి గత నెల 4న తిరిగి వచ్చాడు. యాప్రాల్‌లో ట్రావెల్స్‌ బస్సు దిగిన అతను సిటీ బస్సు ఎక్కాడు. టికెట్‌ తీసుకునే ప్రయత్నంలో ఉండగా ఓ వ్యక్తి అతడి జేబులో ఉన్న ఐఫోన్‌–10ను తస్కరించి బస్సు దిగి పరిగెత్తాడు. తన ఫోన్‌ చోరీకి గురైనట్లు గుర్తించిన బాధితుడు వెంటనే కండెక్టర్‌ నుంచి ఫోన్‌ తీసుకుని తన నంబర్‌కు కాల్‌ చేయగా, అప్పటికే అది స్విచ్ఛాఫ్‌ అయినట్లు గుర్తించాడు. చోరీ చేసిన వెంటనే అంత వేగంగా ఆధునిక ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేయగలిగాడంటే సదరు చోరుడికి ఆయా ఫోన్ల వినియోగంపై పట్టుందని పోలీసులు చెబుతున్నారు.  

పార్శిల్స్‌లో సరిహద్దులు దాటిస్తూ...
ఈ దొంగల నుంచి చోరీ ఫోన్లు కొనేందుకు కొందరు సెకండ్‌ హ్యాండ్‌ వ్యాపారులు సిద్ధంగా ఉంటున్నారు. సిండికేట్‌గా ఏర్పడే వీరు నిర్ణీత సంఖ్యలో ఫోన్లు తమ వద్దకు చేరిన వెంటనే ‘ఎక్స్‌పోర్ట్‌’ పని మొదలెడుతున్నారు. నగరానికి రష్యా, చైనాల నుంచి వివిధ వస్తువుల దిగుమతి జరుగుతూ ఉంటుంది. ఇలా వచ్చిన వాటిలో కొన్ని వివిధ కారణాల నేపథ్యంలో రిటర్న్‌ అవుతాయి. ఇలాంటి వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుంటున్న చోరీ ఫోన్ల కొనుగోలుదారులు వాటితో కలిపి చోరీ సెల్‌ఫోన్లను ఆయా దేశాలకు తరలిస్తున్నారు. ఐ–ఫోన్లు చాలా సెక్యూర్డ్‌ అని, తస్కరణకు గురైనా వాటి ఆచూకీ కనిపెట్టవచ్చని, ఎవరైనా చేజిక్కించుకున్నా ఓపెన్‌ చేయలేరనే భావన అనేక మందిలో ఉంటోంది. అయితే ఈ అంతర్జాతీయ ముఠాలు సాంకేతిక పంథాను అనుసరిస్తూ వీటిని అన్‌లాక్‌ చేస్తున్నాయి. 

ఆ మెసేజ్‌ వద్దు
ఐఫోన్‌ వినియోగదారులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఫోన్‌ పోగొట్టుకుంటే ఐక్లౌడ్‌లో బ్రాడ్‌ కాస్ట్‌ మెసేజ్‌ పెట్టినా ఇబ్బంది ఉండకపోవచ్చు. చోరీకి గురైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ
ఈ మెసేజ్‌ పెట్టరాదు. అలా చేస్తే నేరగాళ్లు హ్యాకర్ల సాయంతో వ్యక్తిగత వివరాలు సంగ్రహించడానికి అవకాశం ఇచ్చిన వారవుతారు. ఈ తరహా బాధితులు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు. పోలీసులను ఆశ్రయిస్తున్న వారంతా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే కావడం గమనార్హం. మీ ఫోన్‌ లొకేషన్‌ అంటూ హ్యాకర్లు పంపే లింకు కేవలం ఒకేసారి ఓపెన్‌ అవుతుంది. రెండోసారి ప్రయత్నిస్తే ‘డెసెప్టివ్‌ వెబ్‌సైట్‌ వార్నింగ్‌’ అంటూ డిస్‌ప్లే అవుతుంటుంది. ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.       – సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

హ్యాకర్ల సాయంతో ఎస్‌ఎంఎస్‌లు..
ఇలా ఐఫోన్లు కోల్పోయిన బాధితులు వెంటనే ఐక్లౌడ్‌లోకి వెళ్లడం ద్వారా తమ ఫోన్‌ను ‘లాస్ట్‌ మోడ్‌’లో పెడుతూ ‘బ్రాడ్‌ కాస్ట్‌మెసేజ్‌’ టైప్‌ చేస్తున్నారు. దీంతో ఆ ఫోన్‌ ఎవరికి దొరికినా దాని స్క్రీన్‌పై ‘ఈ ఫోన్‌ నేను పోగొట్టుకున్నాను’ అనే సందేశంతో పాటు బాధితుడి ఫోన్‌ నెంబర్‌ డిస్‌ప్లే అవుతూ ఉంటుంది. దీనిని ఇతర దేశాల్లో ఉంటున్న హ్యాకర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బల్క్‌ ఎస్సెమ్మెస్‌ సైట్స్‌ను హ్యాక్‌ చేయడం ద్వారా ఆయా బాధితుల నంబర్లకు సందేశాలు పంపుతున్నారు. ఈ మెసేజ్‌లో సెండర్‌ వివరాలు డిస్‌ప్లే అయ్యే చోట ఐక్లౌడ్‌ను పోలిన పేరు పెడుతున్నారు. పంజగుట్టకు చెందిన సదరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు శనివారం ఇలాంటి సందేశమే వచ్చింది. ‘మీరు పోగొట్టుకున్న ఐఫోన్‌ను గుర్తించాం’ అంటూ ‘ఐసీఐఓయూడీ’ నుంచి మేసేజ్‌ వచ్చింది. కంగారులో సీ తర్వాత ఐ అక్షరాన్ని చూసిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఎల్‌గా భ్రమించారు. దీంతో ఐక్లౌడ్‌ నుంచి ఆ సందేశం వచ్చిందని భావించి అందులోని లింకును క్లిక్‌ చేశారు.  

నేరుగా హ్యాకర్‌ సైట్‌ ఓపెన్‌...
ఇలా క్లిక్‌ చేసిన వెంటనే ఆ లింకు నేరుగా సదరు హ్యాకర్‌ సృష్టించిన ఐక్లౌడ్‌ను పోలిన సైట్‌కు చేరుతోంది. అందులో ఫోన్‌ లోకేషన్‌ తెలుసుకోవాలంటే యూపిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయమని కోరుతుంది. పంజగుట్టకు చెందిన ఇంజినీర్‌ అలా చేయడంతో ఈ వ్యక్తిగత వివరాలు కూడా చోరీకి గురైన ఫోన్‌ను చేజిక్కించుకున్న ముఠాకు చేరాయి. వీటి ఆధారంగా ఆయా ఫోన్లను ఈ ముఠాలు అన్‌ లాక్‌ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకసారి అన్‌లాక్‌ అయిన తర్వాత వాటి ఐఎంఈఐ నెంబర్‌ను క్లోనింగ్‌ చేసి ఎక్కడా ట్రాక్‌ కాకుండా చేసి ఆన్‌లైన్‌లో భారత్‌ సహా ఇతర దేశాల్లో విక్రయిస్తున్నారు. క్లోనింగ్‌ సాధ్యం కాకపోతే రష్యా, చైనా తదితర విదేశాల్లో విక్రయిస్తున్నారు. ఐఎంఈఐ నంబర్‌ మారితే దేశంలో ఉన్నా ట్రాక్‌ చేయడం సాధ్యం కాదు. మారకపోయినా విదేశాల్లో ఉంటే మన పోలీసులు గుర్తించలేరు. ఈ కారణంగానే చోరీకి గురైన, కొన్నిసార్లు పోగొట్టుకున్న ఐ–ఫోన్లు ట్రాక్‌ కావట్లేదని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top