మైనర్‌పై అత్యాచారం

Nirbhaya Case Files On Six Members In Molestation Minor East Godavari - Sakshi

 ఆరుగురిపై ‘నిర్భయ’ కేసు

తూర్పుగోదావరి, పి.గన్నవరం: మైనర్‌పై మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆమె కాపురం చెడిపోవడానికి కారకుడైన వివాహితుడిపై పి.గన్నవరం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. అతడికి సహకరించిన తల్లితో సహా మరో ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్‌ వేశారు. ఏఎస్సై కేవీఎస్‌వీ ప్రసాద్‌ కథనం ప్రకారం.. నాగుల్లంక శివారు గుడ్డాయలంకకు చెందిన 16 ఏళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల వివాహితుడు వడ్డి రవిరాజు మూడేళ్ల క్రితం ప్రేమిస్తున్నానని ఆమెకు మాయ మాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. సెల్‌ఫోన్‌ కొనిచ్చి తరచూ మాట్లాడేవాడు. గుడ్డాయలంకలోని ఆమె ఇంటి వద్ద, పొన్నమండలోని అమ్మమ్మ ఇంటి వద్ద పలుమార్లు ఆమెపై రవిరాజు అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఆ సమయంలో స్నేహితులు కొనుకు నాగేంద్ర, మందపాటి సతీష్, యన్నాబత్తుల ముఖేష్, చిన్నమ్మ బద్దే మంగాదేవి  రవిరాజుకు సహకరించేవారని ఏఎస్సై వివరించారు.

బెహ్రన్‌ దేశంలో ఉన్న తండ్రికి ఈ విషయం తెలియడంతో అతడు ఇక్కడికి వచ్చి గత జూన్‌ 20న బాలికకు వివాహం చేశాడు. పెళ్లయినా రవిరాజు ఆమెను వేధించడం మానలేదన్నారు. తన భార్యను వదిలేసి, బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడన్నారు. రవిరాజు తరచూ ఫోన్‌ చేస్తుండడంతో భర్త, అత్త, మామలు ఆమెను అనుమానించారు. దీంతో ఆమె కాపురం చెడిపోయింది. అత్తింటి వారు ఈనెల ఏడోతేదీన బాలికను గుడ్డాయలంకకు తీసుకువచ్చి పుట్టింటి వద్ద వదిలేశారు. దీంతో బాలిక సోమవారం రాత్రి పి.గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రధాన నిందితుడు రవిరాజుతో పాటు అతడికి సహకరించిన ముగ్గురు స్నేహితులతో పాటు చిన్నమ్మ మంగాదేవి, తల్లి వడ్డి మంగాలక్ష్మిలపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై ప్రసాద్‌ వివరించారు. కేసును రావులపాలెం సీఐ పెద్దిరాజు దర్యాప్తు చేస్తారన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top