'ఆఫర్‌' అని.. అడ్డంగా ముంచారు! | Sakshi
Sakshi News home page

'ఆఫర్‌' అని.. అడ్డంగా ముంచారు!

Published Sat, Sep 21 2019 10:56 AM

In The Name Of Unexpected Prize Online Fraud Took Place At Velgatoor - Sakshi

సాక్షి, ధర్మపురి: ‘హలో సర్‌.. మేము ఫలానా కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.. మీరు ఈ రోజు మా లక్కీడ్రాలో విజేతగా నిలిచారు.ఆరువేల సెల్‌ఫోన్‌ మూడు వేలకే అందిస్తున్నాం’ అంటూ అవతలి నుంచి ఓ అమ్మాయి ఫోన్‌ చేయగానే సరే పంపించండి అంటూ సంతోషపడుతున్న అమాయకులు నిం డా మునుగుతున్నారు. చెప్పిన వస్తువులకు బదులు వేరే వస్తువులు వస్తుండడంతో లబోదిబోమంటున్నారు. వెల్గటూరు మండలం ఎండపల్లిలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. బాధితులు వివరాల ప్రకారం.. వెల్గటూరు మండలం ఎండపెల్లికి చెందిన సింహరాజుల సత్యనారాయణకు నాలుగురోజుల క్రితం గుర్తుతెలియని నంబర్‌ నుంచి ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది.

‘మీ ఫోన్‌ నంబరుకు జే–7ఫోన్‌ ఆఫర్‌ ఉంది. దీని విలువ రూ.6000కాగా ఆఫర్లో మీకు రూ.3150 వస్తోందని’ చెప్పారు. నమ్మిన సత్యనారాయణ పంపిచమన్నాడు. తనకు ఎలాగు సెల్‌ఫోన్‌ ఉందని తన స్నేహితుడు  శివకు లేదని ఆలోచించి అతడిని ఈ ఫోన్‌ను తీసుకొమ్మన్నాడు. శుక్రవారం పార్సిల్‌ వచ్చింది. శివ రూ.3,150 చెల్లించి పార్సిల్‌ స్వీకరించాడు. విప్పిచూడగా ఫోన్‌కు బదులు వెజిటేబుల్‌ కట్టర్‌ ఉంది. దీంతో సత్యనారాయణ, శివ కంగుతిన్నారు. వెంటనే  పార్సిల్‌పైఉన్న నంబరుకు కాల్‌ చేశారు. 24గంటల తరువాత ఫోన్‌చేస్తే.. వివరాలు తెలియజేస్తామని అవతలి వైపునుంచి నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. మోసపోయామని గ్రహించిన ఇద్దరూ తల  పట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇదే కంపెనీకి చెందిన ఫోన్‌కాల్‌ గొడిసెలపేట గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు తంగళ్లపెల్లి చక్రపాణికి వచ్చింది. ఆయన కూడా జే–7ఆఫర్‌ ఫోన్‌బుక్‌ చేసుకున్నారు. ఎండపెల్లిలో మోసం జరిగిందని తెలుసుకుని పార్సిల్‌ను విప్పకుండానే వెనక్కి పంపించాడు. 

Advertisement
Advertisement