ప్రేమపేరుతో ముంచాడు.. న్యాయం కావాలి | man fraud in the name of love in odisha | Sakshi
Sakshi News home page

న్యాయం కావాలి

Feb 15 2018 12:45 PM | Updated on Feb 15 2018 12:45 PM

man fraud in the name of love in odisha - Sakshi

ఎస్‌పీ కార్యాలయం ఎదుట తనకు న్యాయం చేయాలని పసిబిడ్డతో ఆందోళన చేస్తున్న బాధితురాలు రస్మిత సాహు

ఒడిశా(బరంపురం) : నగరమంతా బుధవారం యువతీ యువకులు ప్రేమికుల రోజును అమితోత్సాహంతో ఓ వైపు జరుపుకుంటోం ది. మరో వైపు ప్రేమపేరుతో నమ్మించి పెళ్లి చేసుకుని ఏడాది పాటు కాపురం చేసి ఒక బిడ్డకు తల్లిని చేసి భర్త పరారైన  కారణంగా తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు వేడుకుంటోంది. ఈ మేరకు బరంపురం ఎస్‌పీ కార్యాలయం ఎదుట బంధువులతో కలిసి ఆందోళన చేపట్టింది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని కుదలా బ్లాక్‌ పరిధి మధురా గ్రామంలో నివాసం ఉంటున్న రస్మిత సాహు..అక్కడికి దగ్గరలో ఉన్న కౌసిలా గ్రామానికి చెందిన యువకుడు సమీర్‌ పడియారి మధ్య రెండేళ్లు ప్రేమవ్యవహారం నడిచింది. వీరి ప్రేమను యువకుని పెద్దలు వ్యతిరేకించడంతో వారిద్దరూ నారాయణి శక్తిపీఠంలో వివాహం చేసుకున్నారు.

గుజరాత్‌లో కాపురం
అనంతరం భార్యాభర్తలు సమీర్‌ ఇంటికి వెళ్లగా రూ.5 లక్షలు కట్నం ఇవ్వాలని రస్మిత సాహు కుటుంబసభ్యులను అత్తవారు డిమాండ్‌ చేయడంతో కొత్తజంట గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌కు వెళ్లి ఏడాది పాటు కాపురం చేసింది. ఈ క్రమంలో రస్మిత ఒక బిడ్డకు తల్లిఅయిన అనంతరం భర్త సమీర్‌ సూరత్‌లో భార్య రస్మితను విడిచి పరారయ్యాడు. అనంతరం రస్మిత అతి కష్టంమీద గ్రామానికి చేరుకుని కౌసలిపూర్‌ గ్రామంలో నివాసముంటున్న అత్తవారింటికి వెళ్లింది. మూడు రోజుల క్రితం తనను అత్తవారు తనను ఇంటి నుంచి బయటకి పంపేశారని ఆరోపించింది. జరిగిన సంఘటనపై కుదలా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా భర్తపై గానీ అత్తవారిపై కానీ చర్యలు తీసుకోక పోవడంతో ఎస్‌పీ కార్యాలయం ఎదుట   కుటుంబ సభ్యులు, పసిబిడ్డతో కలిసి ఆందోళనకు దిగినట్లు బాధితురాలు రస్మిత సాహు వాపోయింది. పోలీసు అధికారులు దృష్టి సారించి తనకు వెంటనే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని బాధితురాలు వేడుకుంటోంది. అనంతరం ఒక వినతి పత్రాన్ని ఎస్‌పీకి బాధితురాలు, కుటుంబసభ్యులు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement