బాలికపై లైంగికదాడి.. పరారీలో నిందితుడు | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగికదాడి

Published Fri, Jun 21 2019 8:27 AM

Man Escape in Nine Years Girl Child Molestation Case Hyderabad - Sakshi

ఉప్పల్‌: తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామంతాపూర్‌ టీవీ కాలనీలో రోడ్‌ నంబర్‌–9లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కుటుంబం నాలుగునెలల క్రితం బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చింది. రామంతాపూర్‌ టీవీ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనం ప్రాంగణంలోనే గుడిసె వేసుకుని ఉంటూ అక్కడే పని చేస్తున్నారు.

వారికి ఒక కుమార్తె(9) అదే భవనంలో తాపీమేస్త్రీగా పని చేస్తున్న లక్ష్మణ్‌ అనే యువకుడు గురువారం ఉదయం గుడిసెలో ఎవరూ లేని సమయంలో చిన్నారిని సమీపంలోని మరో భవనంలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భయాందోళనకు గురైన చిన్నారి ఏడుస్తూ వెళ్లి తల్లికి  విషయం చెప్పింది. స్థానికుల సహాయంతో అతడిని పట్టుకుని దేహశుద్ది చేశారు. ఈ విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులు అతడిని వదిలేశారు. ఈ సంఘటన దావానంలా వ్యాపించడంతో బాధితులు ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 

హోం మంత్రి బాధ్యత వహించాలి: బాలల హక్కుల సంఘం  
రాష్ట్రంలో పసిపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలకు హోంశాఖ మంత్రి బాధ్యత వహించాలని బాలల హక్కుల సంఘం గురువారం  డిమాండ్‌ చేసింది. లేని పక్షంలో బంగారు తెలంగాణకు మచ్చ వచ్చే ప్రమాదం ఉందన్నారు. తొమ్మిదేళ్ల బాలిక బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న విషయాన్ని ఆపరేషన్‌ ముస్కాన్‌ టీమ్‌ గుర్తించకపోవడం దారుణమన్నారు.

Advertisement
Advertisement