మీకూ విజయారెడ్డి గతే!

Kamareddy RTO Gets Threatening Calls - Sakshi

కామారెడ్డి ఆర్డీవోకు బెదిరింపు ఫోన్‌కాల్‌

కామారెడ్డి క్రైం: భూమి పాసు పుస్తకాలు జారీ చేయకపోతే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డికి పట్టిన గతే మీకూ పడుతుందంటూ కామారెడ్డి ఆర్డీవో రాజేంద్రకుమార్‌కు ఓ బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఈ ఘటన అధికార వర్గాల్లో కలకలం రేపింది. ఆర్డీవోను బెదిరించిన వ్యక్తిని పోలీస్‌ శాఖలోని ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేసే ఏఆర్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌రెడ్డిగా గుర్తించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సోమారం శివారులో సదరు కానిస్టేబుల్‌ కుటుంబానికి చెందిన 9.12 ఎకరాల భూమి వివాదంలో ఉంది. దీనికి సంబంధించిన పాసు పుస్తకాలు తమ పేరిట మంజూరు చేయాలని ఈ నెల 5న శ్రీనివాస్‌రెడ్డి ఆర్డీవోకు ఫోన్‌ చేసి చెప్పాడు. లేకపోతే విజయారెడ్డికి పట్టిన గతే మీకూ పడుతుందని బెదిరించినట్లు ఆర్డీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలిసింది. కానిస్టేబుల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖ భావిస్తున్నట్లు తెలిసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top