ఆస్తి కోసం భార్యను కాల్చి చంపిన భర్త

Husband Killed Wife Before Suicide In Karnataka - Sakshi

బెంగళూరు : ఆస్తి వివాదం నేపథ్యంలో భార్యకు నిప్పంటించి హత్య చేసిన భర్త అనంతరం తానూ విషం తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దొడ్డ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చన్నాపుర గ్రామంలో చోటుచేసుకుంది. నారాయణప్ప (65) తన భార్య లక్ష్మమ్మ(60) ను హత్యచేసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. మొదటి నుండి జులాయిగా తిరుగుతూ సంసారాన్ని పట్టించుకోని నారాయణప్ప వంశపారంపర్యంగా వస్తున్న భూమిని విక్రయించాలని ప్రయత్నించగా భార్య, పిల్లలు వ్యతిరేకించారు. అయితే నారాయణప్ప భూమిని ఒక్కడే విక్రయించి  వచ్చిన డబ్బులతో ఒకటిన్నర ఏడాదిగా ఇంటికి రాకుండా బయటే తిరుగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో లక్ష్మమ్మ సలహా మేరకు పిల్లలు తమ సంతకాలు లేకుండానే ఆస్తి విక్రయించాడని అమ్మిన నారాయణప్ప, కొనుగోలు చేసిన వ్యక్తిపై కోర్టులో కేసు వేశారు.

కేసు వేయడానికి పిల్లలను లక్ష్మమ్మ ప్రోత్సహించిందని భావించిన నారాయణప్ప గత నెల రోజులుగా గ్రామంలోనే తిరుగుతూ లక్ష్మమ్మను నిప్పంటించి హత్య చేస్తానని చెప్పుకుంటూ తిరిగినట్లు సమాచారం.  అనుకున్నట్టుగానే ఆదివారం తెల్లవారుజామున ఇంటి ముందు పడుకున్న లక్ష్మమ్మపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య చేశాడు. అనంతరం తానూ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్పీ రామ్‌ నివాస్‌ సెపట్‌ గ్రా మాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top