ప్రేమ పేరిట వంచన

girl suicide attempt In  vizianagaram - Sakshi

పెళ్లికి నిరాకరించిన యువకుడు

నాలుగు నెలలుగా దక్కని న్యాయం

పోలీసుస్టేషన్‌ ఎదుటే తల్లీకూతుళ్ల ఆత్మహత్యా యత్నం 

ఆస్పత్రికి తరలింపు...నిలకడగా ఆరోగ్యం 

ప్రేమ పేరిట బాలికను మోసం చేశాడు ఓ యువకుడు. తమకు న్యాయం చేయాలని బాలికతో పాటు తల్లి నాలుగు నెలలుగా గ్రామ పెద్దలు చుట్టూ తిరిగారు. నాలుగు రోజుల కిందట పోలీసుస్టేషన్‌కూ వెళ్లారు. అయినా న్యాయం దక్కలేదు. ఇక న్యాయం జరగదని భావించిన తల్లీకూతుళ్లు పోలీసుస్టేషన్‌ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్ప డ్డారు. ఈ సంఘటన శనివారం లక్కవరపుకోటలో కలకలం రేపింది. దీనికి సంబంధించి ఎస్‌ఐ కె.ప్రయోగమూర్తి, బాధితులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే...

లక్కవరపుకోట: మండలంలోని రేగ గ్రామానికి చెందిన బాలిక కళ్లేపల్లి గ్రామానికి చెందిన కోరాడ సాయిశంకర్‌ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. కలిసి తిరిగారు. విషయం కాస్త బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో సాయిశంకర్‌ను నిలదీశారు. నాలుగు నెలల కిందట పెద్దల సమక్షంలో పెట్టారు. ఇరు కుటుంబాల పెద్దలను పిలిచి పంచాయతీ పెట్టారు. ప్రేమికులకు నచ్చజెప్పి పెళ్లి చేసుకోవాలని సాయిశంకర్‌కు చెప్పారు. దీనికి ప్రియుడు నిరాకరించాడు. తరువాత పలుసార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో నాలుగు రోజుల కిందట బాలిక తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. జరిగిన విషయం చెప్పి న్యాయం చేయాలని పోలీసులను కోరింది. పోలీసులు సాయిశంకర్‌తో పాటు తల్లిదండ్రులను, గ్రామ పెద్దలను స్టేషనకు రప్పించి చర్చిం చారు. అయినా సాయిశంకర్‌ నిరాకరించాడు.
 
కేసులొద్దు...
తనకు సాయిశంకర్‌తో పెళ్లి చేయాలని, కేసులొద్దని బాలిక పోలీసుస్టేషన్‌ చుట్టూ తిరిగింది. స్పందించిన పోలీసులు ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని చెప్పినా బాలిక ఫిర్యాదు చేసేందుకు నిరాకరించింది. దీంతో చేసేది లేక పోలీసులు మిన్నకుండిపోయారు. ఈ క్రమంలో శనివారం ఉదయం బాలిక తన తల్లితో పోలీసుస్టేషన్‌కు వచ్చి మరోసారి పోలీసులకు విన్నవించింది. దీంతో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలోనే పోలీ సుస్టేషన్‌ వెలుపలికి వచ్చి ఇంటి నుంచి తెచ్చుకున్న పురుగుల మందును ఒక్కసారిగా తాగేశారు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు విషయం చెప్పారు. తల్లీకూతుళ్లను ఆటోలో స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించినట్టు చెప్పారు. తల్లీకూతుళ్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

ప్రియుడు కోసం ఆరా...
పురుగుల మందు తాగి ఎస్‌.కోట సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న బాలిక, తల్లి నుంచి పోలీసులు స్టేట్‌మెంటు రికార్డు చేశారు. ప్రియుడు సాయిశంకర్‌ కోసం ఆరా తీస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. 

కౌన్సెలింగ్‌ చేశాం...
ఈ ఘటనపై ఎస్‌ఐ ప్రయోగమూర్తి మాట్లాడుతూ ఇద్దరు మైనర్లు కావడంతో పలుసార్లు కౌన్సెలింగ్‌ చేశామని చెప్పారు. అయినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. ప్రియుడిపై ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పినా బాలిక నిరాకరించడంతో తామేమి చేయలేకపోయామని పేర్కొన్నారు. 

ఎస్‌.కోట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లీకూతుళ్లు

ప్రియుడు సాయిశివశంకర్‌ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top