బెంగళూరులోకారులో కాలిపోయిన స్థితిలో ఒక మహిళా ప్రొఫెసర్ మృతదేహం లభ్యమైంది. వాహనం మంటల్లో కాలిపోతున్న ప్పుడు, చూసిన స్థానికులు దొడ్డబళ్లాపూర్ గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అగ్నిమాపక వాహనాలతో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘోరంపై కూపీ లాగిన అధికారులకు సంచలన విషయాలు తెలిసాయి.
పోలీసుల కథనం ప్రకారం, వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. స్వల్ప వివాదంతో ప్రియరాల్ని పెట్రోలు పోసి తగుల బెట్టాడు. ఒక రోజు తర్వాత నిందితుడి మృతదేహం రైల్వే ట్రాక్పై లభ్యమైంది. జరిగిన కథ ఏంటీ అంటే.
రాజనకుంటె సమీపంలోని మరసంద్ర నివాసి, దేవనహళ్లి తాలూకా కార్యాలయంలో పనిచేస్తున్న 45 ఏళ్ల సి. రామన్జినప్ప, బెంగళూరు ఉత్తర జిల్లాలోని దేవనహళ్లిలోని ఒక ప్రైవేట్ కళాశాలలో కన్నడ ప్రొఫెసర్గా పనిచేస్తున్న 40 ఏళ్ల సరోజ జె. మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. రామన్జినప్ప విడాకులు తీసుకున్న వ్యక్తి కావడంతో, వారిద్దరూ ఈ విషయాన్ని దాచి పెట్టి, గోప్యంగా తమ సంబంధాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి వీకెండ్లో ఔటింగ్కి వెళ్లారు.
ఇందుకోసం రామన్జినప్ప అర్జంట్ అవసరమని చెప్పి తన స్నేహితుడు సురేష్ కుమార్ వద్ద నంచి కార్ తీసుకున్నాడు. అక్కడినుంచి దేవనహళ్లికి వెళ్లి, అక్కడ ఉదయం 9.30 గంటల ప్రాంతంలో స్థానిక బస్ స్టాప్ నుండి సరోజను పిక్ చేసుకున్నాడు. వారిద్దరూ ఉదయం నంది హిల్స్ చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించి, ఉత్సాహంగా గడిపారు.మధ్యాహ్నం చివరికల్లా,ఈ జంట దొడ్డబళ్లాపూర్లోని జింకెబచ్చహళ్లి శివార్లలోని ఏకాంత ప్రదేశానికి చేరుకున్నారు. పోలీసుల విచారణ ప్రకారం, ఇక్కడే కథ విషాదమైన మలుపు తీసుకుంది.
వాహనం లోపల ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో రామంజినప్ప సరోజ తలపై సుత్తితో కొట్టాడు. ఆమె స్పృహ కోల్పోవడంతో ఆమె శరీరాన్ని వెనుక సీటులోకి తరలించి, కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అక్కినుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో అతనికీ కొన్ని కాలిన గాయాలయ్యాయి. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఫోరెన్సిక్స్ ఆధారాలతోపాటు, కారు, దాని అలారం, ఆధార్ ఆధారం కీలకంగా మారింది.
కారు కాలిపోతున్న సమయంలో, కారులోని ఫీచర్ ఆధారంగా కార్ ఓనర్ సురేష్ కుమార్ మొబైల్ ఫోన్కు ప్రమాద ఆటోమేటిక్ అలర్ట్ వచ్చింది. దీంతో కుమార్ రామన్జినప్పకు కాల్ చేశాడు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఇదే సమయంలో పోలీసులు కాలిపోయిన వాహనాన్న కుమార్కు చెందినదిగా గుర్తించి కాల్ చేశారు. దీంతో అతను సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ఉదయమే రామన్జినప్ప తన కారు తీసుకున్నాడనే విషయాన్ని తెలిపాడు.
దీనిపై సీనియర్ పోలీసు అధికారి నేతృత్వంలోని కమిటీ విచారణ చేపట్టింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్లకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇంతలో బెంగళూరు సౌత్లోని బిడది సమీపంలో రైలు పట్టాలపై ఒక మృతదేహం లభ్యమైందని, పూర్తిగా ఛిద్రమై, అవయవాలు తెగిపోయి ఉన్నాయని రైల్వే పోలీసులు సమాచార మిచ్చారు. మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతుడిని రామంజినప్పగా గుర్తించారు.
ఇదీ చదవండి: 75 ఏళ్ల వయసులో ప్రభంజనం, ఎవరీ రంగస్వామి
ఇదిలా ఉండగా శనివారం రాత్రి దేవనహళ్లికి చెందిన మృతురాలు సరోజ భర్త జయశంకర్ తన భార్య అదృశ్యమైనట్లు పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేశాడు. కారులో లభ్యమైన కాలిపోయిన మృతదేహం నుండి అధికారులు కాలిపోయిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సరోజ భర్త జయశంకర్ను సంప్రదించగా, ఆ ఆభరణాలు తన భార్యవేనని ఆయన ధృవీకరించినట్లు ఆ అధికారి తెలిపారు. గతవారం చోటుచేసుకున్న ఈ కేసు దిగ్భ్రాంతి రేపింది.
ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకా


