కూతురుకు విషమిచ్చి.. | Sakshi
Sakshi News home page

కూతురుకు విషమిచ్చి..ఆత్మహత్యాయత్నం

Published Sat, Feb 17 2018 10:22 AM

father gives poison to daughter and suicide attempt - Sakshi

విజయపురిసౌత్‌ (మాచర్ల) : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి.. కూతురుకు పురుగుమందు తాగించడమేగాక తాను కూడా తాగిన ఘటన విజయపురిసౌత్‌లోని బ్రహ్మంగారి గుడి సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా, తండ్రి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాచర్ల మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన మాదాసు వెంకట్రావు అలుగురాజుపల్లి గ్రామానికి చెందిన పద్మను 9 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు.

గత 8 ఏళ్లుగా భార్య పద్మతో కలిసి వెంకట్రావు అలుగురాజుపల్లిలోనే ఉంటూ కూలి పనులు చేసుకొని జీవిస్తున్నాడు. మూడు రోజులుగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంకట్రావు సాయంత్రం అలుగురాజుపల్లి ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న కూతురు ధనలక్ష్మిని(8) విజయపురిసౌత్‌కు తీసుకొని వచ్చి బ్రహ్మంగారి గుడి సమీపంలో పురుగుమందు తాగించాడు. ఆ తర్వాత వెంకట్రావు కూడా పురుగుమందు తాగి భార్య పద్మకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. ఇది గమనించిన గుడి సమీపంలో ఉన్న స్థానికులు వెంకట్రావు, ధనలక్ష్మిని హిల్‌ కాలనీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ధనలక్ష్మి మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. వెంకట్రావుకు ప్ర«థమ చికిత్స చేసిన అనంతరం బంధువులు గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకట్రావుకు ఇద్దరు కుమార్తెలు కాగా ధనలక్ష్మి పెద్ద కుమార్తె. భార్య పద్మ ఫిర్యాదు మేరకు విజయపురిసౌత్‌ పోలీసులు కేసు నమోదు చేయగా, మాచర్ల రూరల్‌ సీఐ దిలీప్‌కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
Advertisement