కోడలిపై అత్తింటివారి అరాచకం

Dowry harassment At Tadepalli - Sakshi

  మూడురోజుల పాటు బంధించి చావబాదిన వైనం

  ప్రేమ పెళ్లి కావడంతో వరకట్నం తేలేదని ఆగ్రహం

  పుట్టింటివారి రాకతో వెలుగులోకి

తాడేపల్లి రూరల్‌: గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని డోలాస్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కోడలిని అత్తింటివారు మూడు రోజుల పాటు బంధించి, చిత్రహింసలు పెట్టారు. ఆమె జుట్టును సైతం కత్తిరించారు. బంధువులు రావడంతో శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బంధువుల సహాయంతో బాధితురాలు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు పల్లె మణి తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిదేళ్ల క్రితం తన సామాజిక వర్గానికే చెందిన రాంబాబును ఆమె ప్రేమ వివాహం చేసుకుంది.

అప్పటి నుంచి కట్నం తీసుకురాలేదంటూ అత్తమామలతో పాటు భర్త రాంబాబు కూడా వేధింపులకు గురిచేసేవాడు. ఎంత హింసించినా ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడంతో, 4 రోజుల క్రితం ఇంట్లో డబ్బులు పోయాయంటూ అత్తమామలు ఆమెపై లేనిపోని నిందలు వేసి భర్తతో కొట్టించారు. అంతేగాకుండా ఇంట్లో నిర్బంధించి భర్తతో పాటు ఆమె వదినలు మూడురోజుల పాటు చితకబాదారు.

ఇంట్లో నుంచి వెళ్తావా లేదా అంటూ కింద పడేసి జుట్టు కత్తిరించారని, కాళ్లు పట్టుకున్నా వదల్లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. చుట్టుపక్కల వారు వచ్చి ఎందుకలా హింసిస్తారని ప్రశ్నించడంతో వారిని సైతం ఇష్టం వచ్చినట్లు తిట్టారని పేర్కొంది. చివరకు పక్కింటి వారు తమ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారని, వారు రావడంతో పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు తెలిపింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top