కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారని.. | Cyber Crime Gang Cheating Real Estate Company in Hyderabad | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ పీఏ పేరుతో మోసాలు

Jan 23 2020 7:53 AM | Updated on Jan 23 2020 11:35 AM

Cyber Crime Gang Cheating Real Estate Company in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శినంటూ ఓ ఘరానా నేరగాడు మోసాలు ప్రారంభించాడు. నగరానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ నుంచి రూ.3.3 లక్షలు వసూలు చేసి.. మరో రూ.2 లక్షలు దండుకోవడానికి ప్రణాళిక రచించాడు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ ఫిబ్రవరి 9న తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారని, ఆ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా మీ సంస్థే ఎంపికైందంటూ నమ్మబలికాడు. బాధితులు నగర సైబ ర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించడంతో దీనిపై కేసు నమోదైంది. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన దర్యాప్తు అధికారులు ఇది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మాజీ రంజీ ఆటగాడి పనిగా బుధవారం గుర్తించారు.

క్రికెటర్‌కు స్పాన్సర్‌ కావాలి..
ఈ ఘరానా మోసగాడు అనేకమంది ప్రముఖుల పేర్లు చెప్పుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. నగరానికి చెందిన ఓ రియల్‌ఎస్టేట్‌ సంస్థ సీఎండీకి గతేడాది డిసెంబర్‌ 26న ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. కేటీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శి తిరుపతిని మాట్లాడుతున్నానంటూ అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగరాజు అనే యువకుడు క్రికెట్‌లో ప్రతిభ కనబరుస్తున్నాడని, ఇంగ్లాండ్‌లో జరిగే అండర్‌–25 వరల్డ్‌ కప్‌కు సెలెక్ట్‌ అయ్యాడని చెప్పాడు. ఈ టోర్నీతోపాటు 20–20 సన్‌రైజ్‌ టీమ్‌కూ ఎంపికయ్యాడని చెబుతూ, నాగరాజు నిరుపేద కుటుంబానికి చెందిన వాడని అన్నాడు. అతడికి క్రికెట్‌ కిట్‌తోపాటు లండన్‌ టూర్‌ ఖర్చులకు స్పాన్సర్‌షిప్‌ అవసరం ఉందని, అందుకు రూ.3.3 లక్షలు ఖర్చవుతాయన్నాడు. ఇదంతా విన్న సదరు సీఎండీ పూర్తిగా తన మాటల వల్లో పడ్డారని మోసగాడు నిర్థారించుకున్నాడు. దీంతో స్పాన్సర్‌షిప్‌ నగదును డిపాజిట్‌ చేయాలంటూ ఓ బ్యాంకు ఖాతా నంబర్‌ ఇచ్చాడు. ఈ టోర్నీకి సంబంధించిన క్రికెట్‌ కిట్‌ను నాగరాజు బెంగళూరులో మీ కంపెనీ పేరుతోనే ప్రింట్‌ చేయిస్తున్నాడని, దాన్ని కేటీఆర్‌ చేతుల మీదుగా ఆయన కార్యాలయంలో, మీడియా సమక్షంలో అందుకుంటాడని చెప్పాడు. ఇది మీ కంపెనీకి మంచి పబ్లిసిటీ ఇస్తుందంటూ నమ్మించాడు. 

ట్రూ కాలర్‌ను నమ్మి.. మోసపోయారు..
అతడి మాటల్ని అనుమానించిన ఆ సంస్థ ప్రతినిధులు తొలుత సందేహించారు. తమకు కాల్‌ వచ్చిన ఫోన్‌ నంబర్‌ను ట్రూ కాలర్‌ యాప్‌లో తనిఖీ చేయగా అందులో తిరుపతి అనే పేరే కనిపించింది. దీంతో అతడు కేటీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శి అనే నమ్మిన సంస్థ నగదును గతేడాది డిసెంబర్‌ 27న ఆంధ్రప్రదేశ్‌లోని నర్సన్నపేట కెనరా బ్రాంచ్‌ శాఖలో ఉన్న ఖాతాకు బదిలీ చేసింది. ఇది జరిగిన వారం తర్వాత సంస్థ ప్రతినిధులు తిరుపతిగా చెప్పుకున్న వ్యక్తిని ఫోన్‌ ద్వారా సంప్రదించి కేటీఆర్‌ కార్యక్రమంపై ఆరా తీశారు. దీంతో ఆయన ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో హడావుడిగా ఉన్నారని, జనవరి 6న నాగరాజుకు కిట్‌ అందించే కార్యక్రమం ఖరారైందని చెప్పాడు. ఆ రోజు నాగరాజు బెంగళూరుకు వెళ్తుండటంతో మరింత ఆలస్యం అవుతుందని చెప్పాడు. 

కేటీఆర్‌ సీఎం అవుతున్నారు..
ఈ నెల 10న ఆ సంస్థ ప్రతినిధులకు మరోసారి ఫోన్‌ చేసిన అతడు.. కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారని నమ్మబలికాడు. స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత, ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఎల్బీ స్టేడియంలో కేటీఆర్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని చె΄్పాడు. ఆ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా మీ సంస్థనే సార్‌(కేటీఆర్‌) ఎం పిక చేశారంటూ మరో ఎర వేశాడు. ఆపై తమ బంధువు ఒకరు రాజమండ్రిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, బిల్లుల కోసం రూ.2 లక్షలు సాయం చేయాలని కోరాడు. రాజమండ్రిలోని ఎస్‌బీఐ శాఖలో అప్పలనాయుడు పేరుతో ఉన్న ఖాతా వివరాలను పంపాడు. దీంతో అనుమానం వచ్చిన సంస్థ ప్రతినిధులు ఆరా తీయగా తాము మోసపోయామని గ్రహించారు. దీంతో వారు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.మోహన్‌రావు దర్యాప్తు చేశారు. ఫోన్‌ నంబర్లు, డబ్బు డిపాజిట్‌ చేసిన బ్యాంకు ఖాతాల ఆధారంగా ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో 2014–16 మధ్య ఆంధ్రప్రదేశ్‌ తరఫున రంజీ జట్టులో ఎంపికైన ఓ వ్యక్తి పనిగా అనుమానిస్తున్నారు. బీసీసీఐ సెలెక్టర్‌గా పలువురికి ఫోన్లు చేసి వసూళ్లు,  ప్రముఖ రాజకీయ నాయకుడి వ్యక్తిగత సహాయకుడిగా పేర్కొంటూ ఢిల్లీలోని ఓ ఆస్పత్రి నిర్వాహకుడి నుంచి డబ్బు డిమాండ్‌ చేసి అరెస్టు అయినట్లు పోలీసులు చెప్తున్నారు. పరారీలో ఉన్న అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement