దంపతుల ఆత్మహత్య

Couple Suicide Attempt Anna Nagar Chennai - Sakshi

అన్నానగర్‌: నాగర్‌కోవిల్‌లో అప్పుల బాధ తాళలేక దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నాగర్‌కోవిల్‌లో మంగళవారం చోటుచేసుకుంది. నాగర్‌కోవిల్‌ బీచ్‌రోడ్డు పెరియవిలైకి చెందిన వేలప్పన్‌ (54). పండ్ల దుకాణంలో పనిచేస్తున్నాడు. ఇతని భార్య అముద (45) పూల వ్యాపారి. వీరికి ప్రసన్నకుమార్‌ (18) అనే కుమారుడు ఉన్నాడు. ఇతను మదురైలో హాస్టల్‌లో ఉంటూ చదువుతున్నాడు. ప్రస్తుతం ప్రసన్నకుమార్‌ ట్రైనింగ్‌ కోసం మహారాష్ట్రకు వెళ్లాడు. నాగర్‌కోవిల్‌లో దంపతులు మాత్రమే ఉంటున్నారు. వీరు ఇంటి అవసరం కోసం అప్పులు చేశారు.  ఈ స్థితిలో తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వలేకపోవడంతో అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేశారు. దీంతో సోమవారం దుకాణానికి వెళ్లి వచ్చిన వేళప్పన్‌ ఇంటికి తిరిగి రాగానే తలుపులు వేసుకున్నాడు. అనంతరం మంగళవారం సాయంత్రం వరకు తలుపులు తెరవలేదు. అనుమానించిన చుట్టుపక్కల వారు వేలప్పన్‌ ఇంటి వంట గది కిటికీలను తెరచి చూశాడు.

అప్పుడు అముద ఉరి వేసుకుని శవంగా వేలాడుతోంది. దీంతో దిగ్భ్రాంతి చెందిన స్థానికులు వెంటనే కోట్టూరు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకుని ఇన్‌స్పెక్టర్‌ అన్బుప్రకాష్‌ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశారు. అక్కడ పడక గదిలో వేళప్పన్‌ ఉరి వేసుకుని శవంగా వేలాడుతున్నాడు. అముద, వేలప్పన్‌ మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం ఆచారిపల్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో అప్పుల ఒత్తిడి తాళలేక విరక్తి చెంది దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top