తాగిన మైకంలో అంబులెన్స్‌ ఎత్తుకెళ్లాడు   

ఓ పారిశ్రామికవేత్త దుశ్చర్య

పోలీసు కేసు, క్షమాపణలతో సరి

టి.నగర్‌: మద్యం మత్తులో పారిశ్రామికవేత్త వీరంగం సృష్టించడమేగాక ఆస్పత్రి అంబులెన్స్‌ను అపహరించాడు. ఈ సంఘటన చెన్నైలో ఆదివారం జరిగింది. చెన్నై నుంగంబాక్కంకు చెందిన నిఖిల్‌ (36) గాయపడిన తన స్నేహితుడిని చికిత్స కోసం థౌజండ్‌ లైట్స్‌లో ఉన్న ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రికి ఆదివారం తెల్లవారుజామున తన లగ్జరీ కారులో తీసుకొచ్చాడు. అతడిని ఆస్పత్రిలో చేర్చి ఇంటికి వెళ్లాలనుకున్న పారిశ్రామికవేత్త మద్యం మత్తులో తన కారును అక్కడే వదిలి అక్కడున్న అంబులెన్స్‌ తాళం తీసుకున్నాడు. దాని సైడ్‌ అద్దాలు పగులగొట్టాడు. చివరకు దాన్ని నడుపుకుంటూ వేగంగా వెళ్లిపోయాడు. మద్యం మత్తులోనే నేరుగా పాలవాక్కంలోని తన ఇంటికి చేరాడు. ఆ తర్వాత తేనాంపేటలోగల ఆస్పత్రి బ్రాంచిలో అంబులెన్స్‌ను అందజేయాలని తన కారు డ్రైవర్‌ను పురమాయించాడు. డ్రైవర్‌ అక్కడికి వెళ్లి అంబులెన్స్‌ తాళాలు అందజేయడంతో అంబులెన్స్‌ అపహరణకు గురైనట్లు ఆస్పత్రి సిబ్బంది తెలుసుకున్నారు. ఈ సమాచారం థౌజండ్‌ లైట్స్‌ ఆస్పత్రికి తెలపడంతో ఆస్పత్రి ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది కంగుతిన్నారు. దీనిగురించి థౌజండ్‌లైట్స్‌ పోలీసు స్టేషన్‌లో ఆస్పత్రి నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పారిశ్రామికవేత్తను విచారించారు. చివరకు మద్యం మత్తులో అతను అంబులెన్స్‌ను తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఆస్పత్రి యాజమాన్యాన్ని పారిశ్రామికవేత్త క్షమాపణ కోరారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top