ఆ వాహనాల ధరలు ఇక మోతే
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ వినియోగదారులకు మరోసారి షాక్ ఇచ్చింది. తన ప్యాసింజర్ వాహనాలను ధరలను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది.ఇన్పుట్ కాస్ట్ భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నుంచి వివిధ ప్యాసింజర్ వాహనాలపై రూ. 25వేల వరకు ధర పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఇటీవల లాంచ్ చేసిన ఎస్యూవీ నెక్సాన్ సహా పలు వాహనాల ధరలు డిసెంబర్ 31తరువాత పెరగనున్నాయని సంస్థ తెలిపింది. మారుతున్న మార్కెట్ పరిస్థితులు, పెరుగుతున్న తయారీ ఖర్చులు, ఇతరత్రా ఆర్థిక కారణాల వల్ల మేం ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నామని టాటామోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ మయాంక్ పరేఖ్ ఓ ప్రకటనలో తెలిపారు. 2018 జనవరి నుంచి పలు మోడళ్లపై రూ. 25వేల వరకు ధరలు పెంచుతున్నట్టు చెప్పారు.
కాగా ఇటీవల ఇయర్ ఎండింగ్, ఖర్చులు, తదితర కారణాల రీత్యా టాటామోటార్స్, మారుతితో పాటు మరిన్ని ఆటోమొబైల్ సంస్థలు ధరల పెంపునకు నిర్ణయించాయి. ఈ క్రమంలో ఇప్పటికే టొయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్ ఇండియా, స్కోడా, ఇసుజు లాంటివి జనవరి నుంచి తమ ఉత్పత్తులపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే.