సింగపూర్లో నీరవ్ మోదీకి చుక్కెదురు
పీఎన్బీ స్కాం, సింగపూర్ హైకోర్టు కీలక ఆదేశాలు
మోదీ సోదరి నాలుగు బ్యాంకు ఖాతాల్లోని రూ. 44 కోట్లు స్వాధీనం
పీఎన్బీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సింగపూర్లో మోదీ సన్నిహితులకు చెందిన ఆస్తులను ఎటాచ్ చేయాలని సింగపూర్ హైకోర్టు ఆదేశాలచ్చింది. నీరవ్మోదీ సోదరి, ఆమె భర్త నిర్వహిస్తున్న కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ. 44.41 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రూ. 44కోట్లను, బ్యాంకు ఖాతాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు సొమ్మును భారత బ్యాంకులనుంచి అక్రమంగా తరలించారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈడీ అభ్యర్థన మేరకు సింగపూర్ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.
కాగా ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో నకిలీ పత్రాలు, లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ (ఎల్ఒయు) లాంటి అక్రమ పద్ధతుల ద్వారా వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన కేసులో వ్యాపారి నీరవ్ మోదీ కీలక నిందితుడు. భారీగా రుణాలను ఎగవేసి లండన్కు చెక్కేసిన మోదీని ఉద్దేశపూర్వక ఎగవేతదారుడుగా భారత ప్రభుత్వం ప్రకటించడంతోపాటు తిరిగి భారత్కు రప్పించాలని భారీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో లండన్ పోలీసులు సహకారంతో గత ఏడాది నీరవ్మోదీని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం లండన్లో జైల్లో ఉన్న మోదీ బెయిల్ పిటిషన్ను వెస్ట్ మినిస్టర్ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.
మరిన్ని వార్తలు