రుణగ్రస్త కంపెనీల్లో వాటా కొంటే.. | SEBI exempts buyers of debt-laden cos from making open offer | Sakshi
Sakshi News home page

రుణగ్రస్త కంపెనీల్లో వాటా కొంటే..

Jun 22 2017 12:53 AM | Updated on Sep 5 2017 2:08 PM

రుణగ్రస్త కంపెనీల్లో వాటా కొంటే..

రుణగ్రస్త కంపెనీల్లో వాటా కొంటే..

భారీ రుణాల్లో కూరుకుపోయిన లిస్టెడ్‌ కంపెనీల్లో వాటా కొనే రుణదాతలు (బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థలు)...

ఓపెన్‌ ఆఫర్‌ అక్కర్లేదు
నిబంధనలు సడలించిన సెబీ

ముంబై: భారీ రుణాల్లో కూరుకుపోయిన లిస్టెడ్‌ కంపెనీల్లో వాటా కొనే రుణదాతలు (బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థలు)...మైనారిటీ షేర్‌హోల్డర్లకు ఓపెన్‌ ఆఫర్‌ ఇవ్వనక్కర్లేదు. ఈ మేరకు బ్యాంకులకు మినహాయింపునిస్తూ నిబంధనల్ని సడలిస్తున్నట్లు మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబి ప్రకటించింది. రూ. 6 లక్షల కోట్ల మొండి బకాయిల సమస్యని పరిష్కరించేందుకు రిజర్వుబ్యాంకు పలు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో సెబి తాజా ప్రకటన చేయడం గమనార్హం.

బుధవారం సమావేశమైన సెబి బోర్డు సడలింపు ప్రతిపాదనల్ని ఆమోదించింది. ఇప్పటివరకూ ఎస్‌డీఆర్‌ స్కీము కింద రుణభారం కంపెనీల రుణాన్ని ఈక్విటీగా పునర్‌వ్యవస్థీకరించుకోవడంతో సమకూరే వాటాకు ఓపెన్‌ ఆఫర్‌ సడలింపు వుంది. ఇక ఆయా కంపెనీల వాటాను రుణదాతలు కొనుగోలు చేసే ఈక్విటీకి కూడా ఓపెన్‌ ఆఫర్‌ మినహాయింపు లభిస్తుంది. సాధారణంగా లిస్టెడ్‌ కంపెనీ నుంచి ఎవరైనా 15 శాతం మించి వాటాను కొంటే మైనారిటీ షేర్‌హోల్డర్ల నుంచి వాటాలు కొనుగోలు చేసేందుకు ఒక నిర్ణీత ధరపై ఓపెన్‌ ఆఫర్‌ జారీచేయాల్సివుంటుంది. రుణదాతల నుంచి సడలింపు కోరుతూ విజ్ఞాపనలు రావడంతో సెబి తాజా నిర్ణయం తీసుకుంది.

ఓపెన్‌ ఆఫర్‌ సడలింపుతో రుణగ్రస్త కంపెనీలో వాటాను రుణదాతలు కొనుగోలు చేసి, కొత్త యాజమాన్యానికి విక్రయించడం వల్ల యాజమాన్య మార్పిడి వ్యయం తగ్గుతుంది. ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా అదనపు వ్యయం సెబి తాజా నిర్ణయంతో రుణగ్రస్త కంపెనీల యాజమాన్య మార్పు సులభమవుతుందని, ఇది ఇన్వెస్టర్లకు ఊరట కల్పించే అంశమని కార్పొరేట్‌ అడ్వయిజరీ సంస్థ కార్పొరేట్‌ ప్రొఫెషనల్స్‌ పార్టనర్‌ మనోజ్‌ కుమార్‌ చెప్పారు.

స్పెక్యులేషన్‌ కోసం పీ–నోట్స్‌ జారీపై నిషేధం..
స్పెక్యులేషన్‌ కోసం పార్టిసిపేటరీ నోట్స్‌ (పీ–నోట్స్‌) ద్వారా స్టాక్‌ మార్కెట్లో సెక్యూరిటీలను కొనుగోలు చేయడాన్ని నిషేధిస్తూ సెబి బోర్డు మరో నిర్ణయం తీసుకుంది. ఈ పీ–నోట్స్‌ను భారత్‌ మార్కెట్లను పరీక్షించడానికి కొంతమంది ఇన్వెస్టర్లు ఉపయోగిస్తున్నందున, వీటిని పూర్తిగా నిషేధించడం లేదని సెబి ఛైర్మన్‌ అజయ్‌ త్యాగి చెప్పారు. బోర్డు సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పెక్యులేషన్‌ కోసం వీటిని వినియోగించడమే నిషిద్దమన్నారు. సెబి వద్ద రిజిష్టర్‌ అయిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల ఖాతాల ద్వారా విదేశీ ఇన్వెస్టర్లు పీ–నోట్స్‌ను ఉపయోగించి ఇక్కడ షేర్లను కొనడం, అమ్మడం చేస్తుంటారు.   

సాక్షి బిజినెస్‌ వెబ్‌సైట్‌లో...
చైనా రాక.. వర్థమాన దేశాలకు కాక
జీఎస్టీతో ఆటో డౌన్‌
ఫండ్స్‌లో పెట్టుబడులకు మంచి తరుణమేనా?
ఆయిల్‌ కంపెనీ షేర్లకు క్రూడ్‌ సెగ
ఎల్‌ అండ్‌ టీకి బ్లాక్‌ డీల్స్‌ కిక్‌
ఈ కంపెనీ ఫలితాల్లో నీరసం
ఆల్‌టైమ్‌ హైకి వందకు పైగా షేర్లు
మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, స్టాక్‌ అప్‌డేట్స్‌..
WWW.SAKSHIBUSINESS.COM

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement