
చెన్నై: ఏకంగా 2,000 పైగా బ్యాంకు ఖాతాలతో ఒక డొల్ల కంపెనీ దాదాపు రూ. 4,000 కోట్ల పైచిలుకు నగదు లావాదేవీలు నిర్వహించిన వైనాన్ని గుర్తించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇంత భారీగా లావాదేవీలు ఉన్నప్పటికీ ఆదాయం గురించి సదరు కంపెనీ సరైన వివరణ ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు. పెద్ద నోట్లను డిపాజిట్ చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువును ఉపయోగించుకుని ఆ సంస్థ.. బ్లాక్మనీని చలామణిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసిందని వివరించారు. పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) జరగకపోయి ఉండి ఉంటే ఇది బైటపడేదే కాదని మంత్రి వ్యాఖ్యానించారు.
ఈ ఉదంతం వెలుగుచూసిన తర్వాత సదరు కంపెనీ ప్రస్తుతం మూతబడిందని ఆమె తెలిపారు. బీజేపీకి చెందిన వ్యాపారవర్గాలు నిర్వహించిన యాంటీ బ్లాక్మనీ డే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీతారామన్ ఈ విషయాలు చెప్పారు. పెద్ద నోట్లు రద్దు తర్వాతే డొల్ల కంపెనీల వ్యవహారాలు బైటికొచ్చాయని ఆమె తెలిపారు.