ధరలు పెంచేసిన మారుతీ సుజుకి | Maruti Suzuki Increases Car Prices By Up To Rs. 17,000 | Sakshi
Sakshi News home page

ధరలు పెంచేసిన మారుతీ సుజుకి

Jan 10 2018 7:03 PM | Updated on Jan 10 2018 7:07 PM

Maruti Suzuki Increases Car Prices By Up To Rs. 17,000 - Sakshi

న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద కారు తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన కార్ల ధరలను పెంచేసింది. తన మోడల్స్‌పై రూ.17వేల వరకు ధరలు పెంచుతున్నట్టు మారుతీ సుజుకీ ప్రకటించింది. ఇన్‌పుట్‌ వ్యయాలు పెరుగడంతో ఆ మేరకు తమ మోడల్స్‌పై ధరలు కూడా పెంచుతున్నట్టు మారుతీ సుజుకీ తెలిపింది. కమోడిటీ, అడ్మినిస్ట్రేటివ్‌, డిస్ట్రిబ్యూషన్‌ వ్యయాలు పెరుగడంతో, తమ మోడల్స్‌ అన్నింటిపై రూ.1700 నుంచి రూ.17వేల శ్రేణిలో ధరలు పెంచుతున్నట్టు బుధవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.  వెంటనే పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది.

మారుతీ సుజుకి హ్యాచ్‌బ్యాక్‌ ఆల్టో 800 నుంచి ప్రీమియం క్రాస్‌ఓవర్‌ ఎస్‌-క్రాస్‌ వరకు మోడల్స్‌ను రూ.2.45 లక్షల నుంచి రూ.11.29 లక్షల శ్రేణిలో విక్రయిస్తోంది. జనవరి నుంచి ధరల పెంపును చేపడతామని మారుతీ గత నెలలోనే చెప్పింది. టాటా మోటార్స్‌ కూడా ఈ నెల 1 నుంచి తమ వెహికిల్స్‌పై రూ.25వేల వరకు ధరలు పెంచింది. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా, హోండా కార్లు, మహింద్రా అండ్‌ మహింద్రా కూడా ఇప్పటికే తమ వాహనాల ధరలను పెంచుతామని తెలిపాయి. ప్రస్తుతం ఈ కంపెనీలు తమ వెహికిల్స్‌పై ధరల పెంపును చేపట్టాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement