
ఆటో రిక్షా నుంచి మందుల దాకా!
జుగ్ను.. హైపర్ లోకల్ మార్కెట్లో పేరొందిన స్టార్టప్! ఆటోరిక్షా నుంచి మొదలైన జుగ్ను సేవలు లాజిస్టిక్, గ్రాసరీ, ట్యాక్సీ వరకూ విస్తరించాయి.
♦ త్వరలో ఆన్ డిమాండ్ మెడికల్ సేవల్లోకి జుగ్ను!
♦ 6 నెలల్లో ప్రారంభం; ముందుగా గుర్గావ్, చండీగఢ్లో
♦ ప్రస్తుతం ఆటో, డెలివరీ, గ్రాసరీ విభాగాల్లో సేవలు
♦ 50 లక్షల మంది కస్టమర్లు; రూ.35 కోట్ల ఆదాయం
♦ ‘స్టార్టప్ డైరీ’తో జుగ్ను వ్యవస్థాపక సీఈఓ సమర్ సింగ్లా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జుగ్ను.. హైపర్ లోకల్ మార్కెట్లో పేరొందిన స్టార్టప్! ఆటోరిక్షా నుంచి మొదలైన జుగ్ను సేవలు లాజిస్టిక్, గ్రాసరీ, ట్యాక్సీ వరకూ విస్తరించాయి. ఇప్పుడీ జాబితాలో ఆన్–డిమాండ్ మెడిసిన్ స్టోర్ సేవలూ చేరనున్నాయి. జుగ్ను యాప్ ద్వారా మందులు బుకింగ్ చేస్తే.. దేశంలో ఎక్కడ మందులున్నా సరే 30 నిమిషాల్లో డెలివరీ చేయటమే తమ ప్రత్యేకత అంటున్నారు సంస్థ వ్యవస్థాపక సీఈఓ సమర్ సింగ్లా. ఇప్పటికే దేశమంతా విస్తరించిన జుగ్ను ఆటోరిక్షాలను మెడిసిన్ డెలివరీకి వినియోగిస్తామని చెప్పారు. ఆన్–డిమాండ్ మెడిసిన్ సేవలు చండీగఢ్, గుర్గావ్లో ప్రారంభించి.. ఆ తర్వాత దేశమంతటా విస్తరిస్తామని ‘స్టార్టప్ డైరీ’తో చెప్పారాయ. జుగ్ను సేవలు, విస్తరణ ప్రణాళికల గురించి మరిన్ని వివరాలు సమర్ సింగ్లా మాటల్లోనే..
జుగ్ను సేవలివే..
‘‘2014 డిసెంబర్లో రూ.40 లక్షల పెట్టుబడితో చండీగఢ్ ప్రధాన కేంద్రంగా జుగ్ను సేవల్ని ప్రారంభించాం. ప్రస్తుతం జుగ్ను ఆటోస్, ఫటాఫట్, డోడో మూడు రకాల హైపర్లోకల్ సేవలందిస్తోంది. ఆటోస్ అంటే ఆటో రిక్షాలు, డోడో అంటే లాజిస్టిక్, ఫటాఫట్ అంటే గ్రాసరీ డెలివరీ. విభాగాల వారీగా చూస్తే..
♦ ప్రస్తుతం దేశంలోని 30 ప్రధాన నగరాలు, పట్టణాల్లో జుగ్ను ఆటోరిక్షా సేవలందుబాటులో ఉన్నాయి. 15 వేల మంది డ్రైవర్లు నమోదయ్యారు. రోజుకు 35 వేల డ్రైవ్స్.. 1.80 లక్షల కి.మీ. దూరం డ్రైవింగ్స్ జరుగుతున్నాయి.ప్రతి డ్రైవ్ మీద డ్రైవర్ నుంచి 10 శాతం కమీషన్ తీసుకుంటాం. ఏడాది ముగిసేలోగా ఆటోరిక్షాల సేవలను 100 నగరాలకు చేర్చాలని లక్ష్యించాం.
♦ 20 నగరాల్లో లాజిస్టిక్ సేవలందిస్తున్నాం. రోజుకు 5 వేల డెలివరీలు చేస్తున్నాం. ఇందులో 2 రకాల ఆప్షన్లుంటాయి. 1. బీ2బీ. అంటే రెస్టారెంట్ ఆర్డర్తో సంబంధం లేకుండా డెలివరీ మాత్రమే చేస్తాం. ప్రతి ఆర్డర్ డెలివరీ మీద 10% కమీషన్ తీసుకుంటాం. 2. బీ2సీ. ఇందులో ఆర్డర్తో పాటూ డెలివరీ రెండూ కూడా జుగ్నూస్ నుంచే జరుగుతాయి. ఆర్డర్ వేల్యూలో 5% కమీషన్తో పాటూ ప్రతి డెలివరీకి రూ.40 చార్జీ తీసుకుంటాం.
♦ ఫటాఫట్లో గ్రాసరీ సేవలను చండీగఢ్లో, ట్యాక్సీ విభాగం సేవల్ని గుర్గావ్లో మాత్రమే అందిస్తున్నాం. త్వరలోనే
వీటిని కూడా దేశవ్యాప్తంగా విస్తరిస్తాం.
టూకన్ పేరిట విదేశాల్లో సేవలు..
జుగ్ను బ్రాండ్ పేరిట మన దేశంలో హైపర్ లోకల్ సేవల్ని, టూకన్ పేరిట విదేశాల్లో టెక్నాలజీ సేవల్ని అందిస్తున్నాం. లాజిస్టిక్, హోమ్ సర్వీసెస్, ఈ–కామర్స్, హెల్త్కేర్, బ్యూటీ అండ్ వెల్నెస్ విభాగాల్లో ఆటోమేటెడ్ బిజినెస్ ఆపరేషన్స్ సేవలందిస్తున్నాం. ఇది బీ2సీ, బీ2బీ ప్రొడక్ట్. ప్రస్తుతం 144 దేశాల్లో 26 వేల మంది కస్టమర్లున్నారు.
50 లక్షల మంది కస్టమర్లు..
ప్రస్తుతం జుగ్నులో అన్ని విభాగాల్లో కలిపి 50 లక్షల మంది కస్టమర్లుంటారు. ఇందులో హైదరాబాద్, విజయవాడ నుంచి 3 లక్షల మంది ఉంటారు. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.100 కోట్ల గ్రాస్ మర్చండెస్ వ్యాల్యూ (జీఎంవీ)కి చేరుకున్నాం. ఈ ఏడాది రెండింతల వృద్ధిని లక్ష్యించాం. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.35 కోట్ల టర్నోవర్ను చేరుకున్నాం. ఈ ఏడాది 25 శాతం వృద్ధిని లక్ష్యించాం.
ఈ ఏడాది రూ.19 కోట్ల నిధుల సమీకరణ..
ప్రస్తుతం మా సంస్థలో వెయ్యి మంది ఉద్యోగులున్నారు. రూ.2 కోట్ల పెట్టుబడులతో చండీగఢ్లోని గ్రాసరీ స్టార్టప్ సబ్కుచ్ ఫ్రెష్, బెంగళూరులోని రెస్టారెంట్ ఆఫర్ డిస్కవరీ స్టార్టప్ యెలో కంపెనీలను కొన్నాం. ఇప్పటిదాకా రూ.9.6 కోట్లు(15 మిలియన్ డాలర్ల) నిధులను సమీకరించాం. స్నో లియోపార్డ్, హోమ్గ్రోన్, పేటీఎం, రాకెట్షిప్ వంటివి ఈ పెట్టుబడులు పెట్టాయి. ఈ ఏడాది చివరికి రూ.19.33 కోట్లు (30 మి. డాలర్లు) సమీకరించనున్నాం. ఈ రౌండ్లో పాత ఇన్వెస్టర్లతో పాటూ కొత్త వాళ్లూ పాల్గొంటారు’’ అని సమర్ వివరించారు.
అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...