ట్రయిన్ల రద్దు- ఐఆర్సీటీసీ డౌన్
5 శాతం పతనమైన షేరు
ఆగస్ట్ 12వరకూ రైళ్ల రద్దు
రిజర్వేషన్ల క్యాన్సిలేషన్ ఎఫెక్ట్
నేడు క్యూ4 ఫలితాల విడుదల
రోజురోజుకీ కోవిడ్-19 కేసులు పెరుగుతూ పోతుండటంతో రైల్వే శాఖ ఆగస్ట్ 12వరకూ అన్ని రెగ్యులర్ రైళ్లనూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే లాక్డవున్ సమయంలో ప్రకటించిన రాజధాని తదితర కొన్ని రైళ్లను మాత్రం నడపనున్నట్లు పేర్కొంది. దీంతో జూన్ 30వరకూ బుక్ చేసిన టికెట్లను రద్దు చేస్తున్నట్లు తెలియజేసింది. తదుపరి దశలో జులై 1- ఆగస్ట్ 12వరకూ తీసుకున్న టికెట్లను సైతం రద్దు చేయడం ద్వారా రిఫండ్ ఇవ్వనున్నట్లు వివరించింది. లాక్డవున్ తొలి దశలో వేసిన 15 జతల రాజధాని, ఎక్స్ప్రెస్ ట్రయిన్లతోపాటు.. వలస కూలీల కోసం నిర్వహిస్తున్న 200 శ్రామిక్ స్పెషల్ రైళ్లను సైతం నడపనున్నట్లు వివరించింది.
షేరు వీక్
రైళ్ల రద్దు నేపథ్యంలో పీఎస్యూ దిగ్గజం ఐఆర్సీటీసీ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం పతనమైంది. రూ. 1340 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 3 శాతం నష్టంతో రూ. 1372 వద్ద ట్రేడవుతోంది. కాగా నేడు ఐఆర్సీటీసీ గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు విడుదల చేయనుంది. త్రైమాసిక ప్రాతిపదికన ఐఆర్సీటీసీ నికర లాభం 35 శాతం వరకూ క్షీణించవచ్చని రీసెర్చ్ సంస్థ స్పార్క్ క్యాపిటల్ అంచనా వేస్తోంది. రూ. 134 కోట్ల స్థాయిలో నికర లాభం నమోదుకావచ్చని పేర్కొంది. ఆదాయం 17 శాతం తక్కువగా రూ. 594 కోట్లకు చేరవచ్చని అభిప్రాయపడింది. ఇబిటా మార్జిన్లు 7 శాతం నీరసించే వీలున్నట్లు అంచనా వేసింది.