
న్యూఢిల్లీ: బ్యాటరీలు, ఫ్లాష్లైట్లు తయారు చేసే ఎవరెడీ ఇండస్ట్రీస్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో భారీగా తగ్గింది. గత క్యూ3లో రూ.21 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.18 లక్షలకు తగ్గిందని ఎవరెడీ ఇండస్ట్రీస్ తెలిపింది. చెన్నైలోని తిరువొత్తియూర్ ప్లాంట్లో కార్మికుల స్వచ్చంద పదవీ విరమణ(వీఆర్ఎస్) వ్యయాలు రూ.23 కోట్లుగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. ఈ క్యూ3లోనే ఈ వీఆర్ఎస్ ప్రక్రియ పూర్తయిందని, ఈ భూమిని అళ్వార్పేట్ ప్రొపర్టీస్కు రూ.100 కోట్లకు విక్రయించడానికి గత డిసెంబర్లోనే ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది.
మొత్తం ఆదాయం రూ.374 కోట్ల నుంచి రూ.388 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ క్యూ3లో బ్యాటరీ అమ్మకాలు 6 శాతం పెరిగాయని తెలిపింది. లైటింగ్ సెగ్మెంట్ టర్నోవర్ 11 శాతం తగ్గి రూ.88 కోట్లకు చేరిందని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎవరెడీ ఇండస్ట్రీస్ షేర్ 0.17 శాతం తగ్గి రూ.202 వద్ద ముగిసింది.