వ్యర్థాలుగా కాదు.. వెలుగుల దిశగా అడుగులు | India EV batteries being a second life repurposed for energy storage | Sakshi
Sakshi News home page

వ్యర్థాలుగా కాదు.. వెలుగుల దిశగా అడుగులు

Dec 18 2025 3:55 PM | Updated on Dec 18 2025 4:30 PM

India EV batteries being a second life repurposed for energy storage

ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం ఏటా పెరుగుతోంది. వాహనదారుల్లో పర్యావరణంపై అవగాహన అధికమవుతోంది. భారత రోడ్లపై గతేడాది దాదాపు 15 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డెక్కడం పర్యావరణ స్పృహకు నిదర్శనం. అయితే, ఈ వాహనాల్లో కీలక భాగంగా ఉన్న ‘లిథియం-అయాన్’ బ్యాటరీల ఆయుష్షు తీరిపోయాక పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. తాజా అంచనాల ప్రకారం 2030 నాటికి దేశంలో ఏటా 50,000 టన్నులకు పైగా బ్యాటరీ వ్యర్థాలు పోగుపడనున్నాయి. కానీ, ఈ వ్యర్థాలను పర్యావరణ ముప్పుగా కాకుండా ఒక అద్భుతమైన ఆర్థిక అవకాశంగా మార్చే దిశగా భారత్ అడుగులు వేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘బ్యాటరీ వ్యర్థాల నిర్వహణ సవరణ నిబంధనలు (2024)’ ఈ రంగంలో సరికొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. కేవలం రీసైక్లింగ్ మాత్రమే కాకుండా ఈ పాత బ్యాటరీలను ‘సెకండ్ లైఫ్’ కింద కొన్ని మార్పులు చేసి మారుమూల గ్రామాల్లో సోలార్ గ్రిడ్లుగా, వ్యవసాయ పంపు సెట్లకు ఎనర్జీ సోర్స్‌లుగా మలచవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పెరుగుతున్న బ్యాటరీలు

ప్రస్తుతం వినియోగిస్తున్న లిథియం-అయాన్ బ్యాటరీల జీవితకాలం సాధారణంగా 8 నుంచి 10 ఏళ్లు. భారత ప్రభుత్వం ఫేమ్‌ 2 పథకం ద్వారా ఈవీలను ప్రోత్సహిస్తున్న తరుణంలో వచ్చే దశాబ్ద కాలంలో లక్షలాది టన్నుల బ్యాటరీ వ్యర్థాలు పోగుపడతాయని అంచనా. వీటిని సరైన పద్ధతిలో నిర్వహించకపోతే అందులోని రసాయనాలు భూగర్భ జలాలను, పర్యావరణాన్ని కలుషితం చేసే ప్రమాదం ఉంది.

రీసైక్లింగ్ ప్రక్రియ

బ్యాటరీలను కేవలం వ్యర్థాలుగా చూడకుండా రీసైక్లింగ్ ద్వారా కలిగే ప్రయోజనాలపై దృష్టి సారించాలి. కొన్ని పద్ధతుల ద్వారా పాత బ్యాటరీల నుంచి లిథియం, కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటి విలువైన లోహాలను 90% పైగా తిరిగి పొందవచ్చు. భారతదేశంలో లిథియం నిల్వలు తక్కువ. రీసైక్లింగ్ పెరిగితే ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘బ్యాటరీ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ (2022)’ ప్రకారం తయారీదారులే బ్యాటరీల సేకరణ, రీసైక్లింగ్‌కు బాధ్యత వహించాలి.

బ్యాటరీలకు ‘సెకండ్ లైఫ్’

అన్ని బ్యాటరీలను వెంటనే రీసైక్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవీల్లో బ్యాటరీ సామర్థ్యం 70-80% కి పడిపోయినప్పుడు అవి వాహనానికి పనికిరావు కానీ, ఇతర అవసరాలకు అవి మెరుగ్గా పని చేస్తాయి. దీనినే సెకండ్‌ లైఫ్‌ అప్లికేషన్లు అంటారు. రీసైకిల్ చేయకుండానే ఈ బ్యాటరీలను గ్రామీణ ప్రాంతాల్లో విభిన్న అవసరాలకు ఉపయోగించవచ్చు.

సోలార్ మైక్రో గ్రిడ్లు: గ్రామాల్లో సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నిల్వ చేయడానికి ఈ పాత ఈవీ బ్యాటరీలను ఉపయోగించవచ్చు. పగలు నిల్వ చేసిన విద్యుత్తును రాత్రి పూట వీధి దీపాలకు, ఇళ్లకు వాడుకోవచ్చు.

వ్యవసాయ పంపు సెట్లు: పొలాల్లో సోలార్ పంపు సెట్లకు బ్యాటరీ స్టోరేజ్‌గా వీటిని అనుసంధానిస్తే విభిన్న వాతావరణ పరిస్థితులున్న సమయంలో కూడా నీటి సరఫరా ఆగదు.

బ్యాకప్ పవర్: గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో ఇన్వర్టర్ల స్థానంలో ఈ బ్యాటరీ ప్యాక్‌లను తక్కువ ధరకే ఏర్పాటు చేయవచ్చు.

నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం, 2030 నాటికి భారతదేశంలో బ్యాటరీ రీసైక్లింగ్ మార్కెట్ విలువ బిలియన్ డాలర్ల(సుమారు రూ.9000 కోట్లు)కు చేరుకుంటుంది. ఈ క్రమంలో పాత బ్యాటరీలను గ్రామీణ విద్యుదీకరణకు వాడటం వల్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యం సులభమవుతుంది. 2027-28 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త బ్యాటరీల తయారీలో కనీసం 5% రీసైకిల్ చేసిన పదార్థాలను వాడాలనే నిబంధనను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌), లోహమ్ (LOHUM) వంటి సంస్థలు ఇప్పటికే పాత ఈవీ బ్యాటరీలను ఎనర్జీ స్టోరేజ్‌లుగా మార్చి గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు ప్రయోగాలు చేస్తున్నాయి. రీసైక్లింగ్ ద్వారా లభించే లిథియం, కోబాల్ట్ ధరలు కొత్త ఖనిజాల తవ్వకం కంటే 25% తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది ఈవీల ధరలు తగ్గడానికి కూడా దోహదపడుతుంది.

ఇదీ చదవండి: భారత మార్కెట్లోకి నిస్సాన్ కొత్త మోడల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement