
సాక్షి, అమరావతి బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నవంబర్ 11 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లాలోని గుంటూరు పార్లమెంట్ అ«ధ్యక్షుడు రావి వెంకటరమణ నేతృత్వంలో పార్లమెంట్ నియోజకవర్గ సమన్వకర్త శ్రీకృష్ణదేవరాయలు, తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, తెనాలి, తాడికొండ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, హెనీ క్రిస్టినా, ప్రత్తిపాడు నియోజకవర్గ నేత అనీల్తో శుక్రవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు రావి వెంకటరమణ మాట్లాడుతూ ఒక్కో నియోజకవర్గంలో 30 గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టాల్సింది ఉంటుందన్నారు. తొలుత గ్రామాల్లోకి వెళ్లి అక్కడ పార్టీ జెండా అవిష్కరించి వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తారని తెలిపారు. తరువాత రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి స్థానిక సమస్యలపై చర్చిస్తారన్నారు. ప్రత్యేక హోదా అవశ్యకతను వివరించి స్లిప్లలో వారితో సంతకాలు సేకరిస్తారు. అనంతరం బూత్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు. గ్రామంలో ప్రభావితం చేసే ఉద్యోగులు, కుల సంఘాల నేతలను కలుస్తారని తెలిపారు. అనంతరం గ్రామంలోనే పల్లె నిద్ర చేస్తారన్నారని వివరించారు. మధ్యలో నియోజకవర్గ స్థాయిలోని విద్యాసంస్థ విద్యార్దులతో సమావేశమవుతారన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి
పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు మట్లాడుతూ రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలన్నారు. టీడీపీ నేతలకు ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో 80 శాతం మంది ప్రజలను గ్రామాల్లోకి వెళ్లి పల్లెనిద్ర, రచ్చబండ ద్వారా కలుసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు సమస్యలపై బ్లూప్రింట్ తయారు చేసుకోవాలని సూచించారు. తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాన్నారు. నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్ అధ్యక్షులతో సమావేశమై ప్రత్యేక కార్యచరణ రూపొందిచారు. తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త కార్యక్రమాన్ని వినూత్ననంగా నిర్వహించేందుకు ప్రణాళిక తయారు చేశామని చెప్పారు.
నరసరావుపేటలో...
నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి రాంబాబు నరసరావుపేటలో నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, చిలకలూరిపేట సమన్వయకర్త మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు. అంబటి రాంబాబునియోజకవర్గ ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ అ«ధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణ సైతం తమ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ ఇన్చార్జులతో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలపై ఇప్పటికే చర్చించారు.