'మంత్రి గంటా శ్రీనివాసరావుకు విశాఖ అంటే ప్రేముంటే వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి జీవో నంబర్ 97ను రద్దు చేయించాలి' అని వైఎస్సార్ సీపీ నేత గుడివాడ అమర్ నాథ్ డిమాండ్ చేశారు.
విశాఖపట్నం: ఎన్నికలకు ముందు బాక్సైట్ తవ్వకాలపై నిరసన గళం వినిపించిన చంద్రబాబు.. ఇప్పుడు గిరిజన సంపదను తవ్వి ఎత్తుకుపోతామని చెబుతుండటం ఆయన గొప్పతనానికి నిదర్శనమని విశాఖ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ ఎద్దేవా చేశారు. అఖిలపక్షం పిలుపుమేరకు విశాఖ మన్యంలోని 13 మండలాల్లో శనివారం బంద్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమర్ నాథ్ మాట్లాడారు.
'లక్షల కోట్ల విలువైన గిరిజన సంపదను ఎవరికి ధారాదత్తం చేస్తున్నారో చెప్పాలి... మంత్రి గంటా శ్రీనివాసరావుకు విశాఖ అంటే ప్రేముంటే వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి జీవో నంబర్ 97ను రద్దు చేయించాలి' అని డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాల జీవో(నంబర్ 97)ను రద్దు చేసేవరకు గిరిజనుల తరఫున వైఎస్సార్ సీపీ పోరాడుతుందని గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు.