
పైనంపల్లి వద్ద వైఎస్ విజయమ్మ అరెస్ట్
వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు
ఖమ్మం: ఖమ్మం-నల్గొండ సరిహద్దు ప్రాంతమైన పైనంపల్లి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లాలలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న విజయమ్మను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి ఆమెను నేలకొండపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆమెను పోలీసులు హైదరాబాద్ కు తరలించనున్నారు. విజయమ్మ అరెస్ట్కు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.
గురువారం ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా విజయమ్మ నల్గొండ వరద బాధిత ప్రాంతాలకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. పైనంపల్లి వద్ద పోలీసులను భారీగా మోహరించి ఆమె పర్యటనకు ఆటంకం కల్గించారు. దీంతో విజయమ్మ రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు.
అంతకు ముందు మధిర నియోజకవర్గంతోని కలకోటలో భారీవర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మిర్చి, జొన్న పంటలను ఆమె పరిశీలించారు. రైతులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ఈ సందర్భంగా దెబ్బతిన్న పత్తి మొక్కలను విజయమ్మకు చూపించి తమ గోడు వెలిబుచ్చారు. వర్షాలతో పూర్తిగా దెబ్బతిన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు లబ్ధి చేకూరే విధంగా రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని విజయమ్మ వారికి హామీ ఇచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో పర్యటనను ముగించుకుని ఈ రోజు ఖమ్మంలో అడుగుపెట్టిన విజయమ్మ బాధితులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.