మరో ప్రత్యేక వంటకం కూడా ఉండాలి: సీఎం జగన్‌

YS Jagan Review Meeting On Midday Meal And Nutrition Food - Sakshi

గర్భిణీలు, పిల్లల తల్లులు, చిన్నారులకు అందించే పౌష్టికాహారంపై సీఎం జగన్‌ సమీక్ష

సాక్షి, అమరావతి : మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచడంపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా మధ్యాహ్న భోజనంలో పిల్లలకు మరో ప్రత్యేక వంటకం ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.  గర్భిణీలు, పిల్లల తల్లులు, చిన్నారులకు అందించే పౌష్టికాహారంపై సీఎం జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం వీరికి అందిస్తున్న పౌష్టికాహారంపై వివరాలు తెలుసుకున్నారు. అదే విధంగా ఈ పథకంలో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులు.. నగదు బదిలీ చేసే అంశంపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ క్రమంలో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా నివారించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో మరో 65 సెంట్రలైజ్‌‍్డ కిచెన్స్‌ ఏర్పాటుపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో సీఎం జగన్‌తో పాటు మంత్రులు ఆదిమూలపు సురేష్‌, తానేటి వనిత పాల్గొన్నారు.

పది రూపాయలు ఎక్కువైనా సరే..
నాడు-నేడు కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44,512 ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయడానికి ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి దశలో సుమారు 15 వేలకుపైగా స్కూళ్లను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఈ నేపథ్యంలో గురువారం నాటి సమావేశంలో... స్కూళ్లలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి సీఎం జగన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ఈ క్రమంలో నవంబర్‌ నుంచి స్కూళ్లలో పనులు ప్రారంభించి... మార్చికల్లా పనులు పూర్తిచేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇందుకు బదులుగా... స్కూళ్లలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ఇస్తున్న పరికరాలు అన్నీకూడా నాణ్యంగా ఉండాలని సీఎం ఆదేశించారు. సౌకర్యాల కల్పనలో ఏ ఇతర స్కూళ్లకూ తీసిపోకూడదని సూచించారు. పది రూపాయలు ఎక్కువైనా సరే సౌకర్యాల కల్పనలో మాత్రం రాజీపడవద్దని పేర్కొన్నారు. అనుకున్న ప్రకారం వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి స్కూలు యూనిఫారమ్స్, పుస్తకాలు అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top