రైతులకు అన్ని విధాలా భరోసా | Sakshi
Sakshi News home page

రైతులకు అన్ని విధాలా భరోసా

Published Fri, Feb 7 2020 4:42 AM

YS Jagan Mohan Reddy Review On Agriculture Mission - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వం ప్రకటించిన ధరల కన్నా రైతులు తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తే వెంటనే జోక్యం చేసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులను ఆదేశించారు. పంట కొనుగోలు చేసిన వారంలోగా రైతులకు డబ్బులు అందాలని, నెల రోజుల్లో పరిస్థితి మారకపోతే సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తానని హెచ్చరించారు. అగ్రి వ్యవసాయ మిషన్‌ సమీక్షలో భాగంగా గురువారం ఆయన పంటల కొనుగోలు కేంద్రాల తీరు, రైతులకు లభిస్తున్న ధరలపై ఆరా తీశారు.

కొనుగోలు కేంద్రాలు మరింత సమర్థవంతంగా నడవటానికి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన ధరల పట్టిక ఉంచాలని స్పష్టం చేశారు. ప్రకటించిన ధరల కన్నా తక్కువకు కొనుగోలు చేస్తే వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగి కొనుగోళ్లు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం సరైన మార్కెటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం శనగలు, కందులు మార్కెట్లోకి వస్తున్నాయని, కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా చూడాలని ఆదేశించారు.

అన్నదాతలకు చిన్న ఇబ్బంది కూడా రాకూడదు 
పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధరలను, కొనుగోలు కేంద్రాల వివరాలను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. వారానికోసారి కచ్చితంగా సమావేశం నిర్వహించి, రైతులకు అందుతున్న ధరలపై సమీక్ష చేయాలని.. నాలుగు వారాలకోసారి తనతో సమావేశం కావాలని ఆదేశించారు.

దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన ధర కన్నా తక్కువ ధర వస్తుంటే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందనే విషయంపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. పంటను అమ్ముకోవడానికి రైతులకు చిన్న ఇబ్బంది కూడా రాకూడదని, ఈ కీలక అంశాలను అధికారులు సవాలుగా తీసుకుని పనిచేయాలని చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వచ్చినా పర్వాలేదని స్పష్టం చేశారు.

నకిలీ విత్తనాల కేసులను సీరియస్‌గా తీసుకోవాలి 
నకలీ విత్తనాల కేసులను చాలా సీరియస్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ అదేశించారు. వ్యవసాయ శాఖలోనే లీగల్‌ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వివరించారు. విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షలు పక్కాగా ఉండాలని, రైతులు నాణ్యమైన విత్తనాలను కోరుకుంటున్నందున.. వాటిని అందించడంపై దృష్టిపెట్టాల్సిందిగా సీఎం సూచించారు. విత్తన కొనుగోళ్లలో అక్రమాలకు తావులేకుండా చూడాలని సీఎం ఆదేశించారు.

యూనివర్సిటీ సిఫార్సుల ప్రకారం బెంగాల్‌ గ్రామ్‌ విత్తనాలను పూర్తి స్థాయిలో సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఎరువులు, విత్తనాల కంపెనీల నుంచి మంచి సానుకూల స్పందన వస్తోందని, ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల సంతృప్తికరంగా ఉన్నాయని అధికారులు వివరించారు. రైతు భరోసా కేంద్రాలు ఈ కంపెనీలకు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయని, ఆ మేరకు ధరలు తగ్గించి ఎరువులు, విత్తనాలు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.

గోదాములు, కోల్డ్‌ స్టోరేజీలపై ప్రత్యేక దృష్టి  
శ్రీకాకుళంలో గోదాముల సమస్య గురించి అగ్రి మిషన్‌ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. గోదాములు, కోల్డ్‌ స్టోరేజీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. కొత్త గోదాముల నిర్మాణం జరిగేంత వరకు ప్రత్యామ్నాయాలు చూడాలని, సరిపడా గోదాములు, కోల్డ్‌స్టోరేజీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయ శాఖ తనదిగా భావించి పనిచేయాలని, వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించాలన్నారు. పశు సంవర్థకం, హార్టికల్చర్, ఫిషరీస్‌ రంగాలకు రైతు భరోసా కేంద్రాల ద్వారా కొత్త ఊపు ఇవ్వాలని సూచించారు.

మందులు వాడకుండా పాలు ఉత్పత్తి చేసే వారికి  ప్రోత్సాహం 
పశువులకు వైద్యం అందిస్తున్న విధానాలపై ముఖ్యమంత్రి జగన్‌ ఆరా తీశారు. మందులు వాడకుండా పాలు ఉత్పత్తి చేసే వారిని పోత్సహించాలని, అలాంటి పాలకు గిట్టుబాటు ధరలు మరింత పెంచాలని ఆదేశించారు. ఆర్గానిక్‌ మిల్క్‌ పేరిట ఈ పాలను అమ్మేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువులన్నింటికీ ట్యాగ్‌ వేయాలన్నారు.

ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రాల లోగోను సీఎం ఆవిష్కరించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, కె.కన్నబాబు, అనిల్‌కుమార్‌ యాదవ్, కొడాలి నాని, సీఎస్‌ నీలం సాహ్ని తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement