సమాజం ఎంత ముందుకు వెళ్లిన ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతోంది. ఆధునిక యుగంలోనూ ఆడపిల్లలకు అనాదరణే ఎదురవుతోంది.
వరంగల్: సమాజం ఎంత ముందుకు వెళ్లిన ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతోంది. ఆధునిక యుగంలోనూ ఆడపిల్లలకు అనాదరణే ఎదురవుతోంది. మూర్కత్వంతో పసిపాపల ప్రాణాలు తీసుసేందుకు కూడా వెనుకాడడం లేదు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల అనుబంధ గ్రామం బుగ్గతండాలో దారుణం జరిగి 24 గంటలు గడవకముందే వరంగల్ జిల్లాలో మరో ఘటన వెలుగు చూసింది.
రెండో కాన్పులోనూ తనకు మనవరాలే పుట్టిందన్న అక్కసుతో ఓ నాయనమ్మ పసిపాప ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించింది. నెలన్నర వయసున్న పాప నోట్లో కిరోసిన్ పోసి హత్యాయత్నం చేసింది. ధర్మసాగర్ మండలం కమ్మరిపేట శివారు చింతల్ తండాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. పాప పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇలాంటి ఘటనే సోమవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల అనుబంధ గ్రామం బుగ్గతండాలో జరిగింది. రెండోమారూ ఆడపిల్ల పుట్టిందనే కోపంతో పసిపాపకు సబ్బునీళ్లు తాగించి చంపాలని తల్లిదండ్రులు ప్రయత్నించారు. అదృష్టవశాత్తు పాప ప్రాణాలతో బయటపడింది.