వినాయక స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజులపాటు జరిగిన నవరాత్రి ఉత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.
కాణిపాకం, న్యూస్లైన్: వినాయక స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజులపాటు జరిగిన నవరాత్రి ఉత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. ఇందులో భాగంగా ధ్వజ స్తంభానికి ప్రత్యేక పూజలు చేసి, మూషిక పటాన్ని కిందికి దించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయంలో యజ్ఞయాగాదులు నిర్వహించి, అంకురార్పణ సమయంలో ధరించిన కంకణాలను తొలగించారు. తర్వాత ధ్వజస్తంభాన్ని పవిత్ర జలంతో అభిషేకించారు. ధ్వజస్తంభం వద్ద చతుర్వేద పారాయణం చేసి మంత్రపుష్ప నివేదన చేశారు. కాగా గురువారం నుంచి 29వ తేదీ వరకు వినాయకస్వామి వారికి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.
వైభవంగా త్రిశూల స్నానం
వినాయకుని ధ్వజావరోహణం సందర్భంగా బుధవారం ఉదయం వైభవంగా త్రిశూల స్నానం నిర్వహించారు. మొదట స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ అన్వేటి మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం యాగశాలలోని పుట్టమన్నులో వేసిన అంకురాలను మంగళవాయిద్య, మేళతాళ ధ్వనుల మధ్య తీసుకెళ్లి స్వామివారి పుష్కరిణి లో కలిపారు.
తదుపరి పుష్కరిణి వద్ద స్వామివారి త్రిశూలానికి సంప్రదాయబద్ధంగా అభిషే కం నిర్వహించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకం జరిపి పుష్కరిణిలో త్రిశూల స్నానం జరి పించారు. ఉభయదారులు, ఆలయ సిబ్బంది ఆనందంతో వసంతోత్సవాలు జరుపుకున్నారు. పుష్కరిణిలో మునిగి రంగులు చల్లుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పూర్ణచంద్రరావు, ఆలయ ఏఈవోలు ఎన్ఆర్.కృష్ణారెడ్డి, ఎస్వీ.కృష్ణారెడ్డి పాల్గొన్నారు.