అనంతమైన నీలాకాశం.. అదే రంగులో అలరించే అందాల సాగరం.. ఇవి సాధారణంగా ప్రకృతి ప్రేమికులను పరవశింపజేసే దృశ్యాలు.. కానీ సి.వి.రామన్ పులకరింతతోనే ఆగిపోలేదు.
=ఏవీఎన్ కళాశాలలో విద్యాభ్యాసం
=ఏయూతో విడదీయరాని బంధం
=పరిశోధనకు ఇక్కడే పునాది
అనంతమైన నీలాకాశం.. అదే రంగులో అలరించే అందాల సాగరం.. ఇవి సాధారణంగా ప్రకృతి ప్రేమికులను పరవశింపజేసే దృశ్యాలు.. కానీ సి.వి.రామన్ పులకరింతతోనే ఆగిపోలేదు. భౌతిక శాస్త్రంలో సరికొత్త ఆవిష్కరణ కోసం పలవరించాడు. పరితపించాడు. ఆకాశం, సముద్రం.. రెండూ నీలం రంగునే ప్రతిఫలించడంపై పరిశోధించాడు. ‘రామన్ ఎఫెక్ట్’ను ప్రపంచానికి అందించి, నోబెల్ బహుమతి సాధించాడు. ఆ విఖ్యాత శాస్త్రవేత్త విశాఖలోనే చివురు తొడిగి.. మహావృక్షంగా ఎదిగాడన్న వాస్తవం మనందరికీ గర్వకారణం.
ఏయూ క్యాంపస్, న్యూస్లైన్ : కాంతి కిరణాలపై పరిశోధన చేసి ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తిని ఇనుమడింపజేశారు చంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి.రామన్). భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఆయన. చిన్నతనం నుంచి తన చుట్టూ పరిసరాలను పరిశీలిస్తూ ప్రశ్నించే తత్వం అలవరచుకొని, ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా ఎదిగారు. విజ్ఞాన శాస్త్రం చిగురుతొడుగుకుంటున్న రోజుల్లోనే మహావృక్షంగా అవతరించారు. ఆయన ప్రాథమిక విద్య మిసెస్ ఏవీఎన్ కళాశాలలో జరిగింది. ఇక్కడే ఉన్నతంగా ఎదగడానికి బలమైన పునాది పడిందనడంలో సందేహం లేదు.
బాల్యంలో అందించే క్రమబద్ధమైన, ఆలోచనాత్మకమైన విద్యా విధానం వ్యక్తిని ఎంతటి ఉన్నత స్థానానికైనా తీసుకువెళ్తుందనడానికి ఆయన జీవితం ఉదాహరణ.
విద్యాభ్యాసం అంతా ఇక్కడే: 1888 నవంబర్ 7న తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో జన్మించిన రామన్ చిన్నతనమంతా విశాఖలోనే సాగింది. ఆయన తండ్రి చంద్రశేఖర్ అయ్యర్ మిసెస్ ఏ.వి.ఎన్.కళాశాలలో భౌతిక, గణిత శాస్త్రాలను బోధించేవారు. రామన్ కూడా ఇదే కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరుతెచ్చుకున్న రామన్ తన పదకొండవ ఏట మెట్రిక్యులేషన్, పదమూడోఏట ఇప్పుడు ఇంటర్కు సమానమైన ఎఫ్ఏను పూర్తిచేశారు. తరగతిలో టాపర్గా నిలిచారు. తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించారు.
కళాశాలను మరువలేదు: తాను చదువుకున్న కళాశాలలను సి.వి.రామన్ మరువలేదు. విశాఖను వీడి వెళ్లిన తరువాత అనేక ఉన్నత స్థానాలను అధిరోహిం చినప్పటికీ తన కళాశాలతో అనుబంధాన్ని కొనసాగించారు. 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్న తరువాత 1938 నవంబర్ 11న విశా ఖ వచ్చారు. ఏవీఎన్ కళాశాలను సందర్శించి అక్కడ ఆయన చేసిన సంతకం నేటికీ పదిలంగా ఉంది.
జ్ఞాపకాలు పదిలం : రామన్ తండ్రి కళాశాలకు బహూకరించిన చెక్క అల్మారా, రామన్ అందించిన పలు పుస్తకాలు నేటికీ ఏవీఎన్ కళాశాలలో ఉన్నాయి. రామన్లాగే ఇవి తమ సంపదగా భావించి కళాశాల యాజమాన్యం వాటిని కాపాడుతోంది. ఆ మహానుభావుడు ప్రయోగాలు చేసిన లేబొరేటరీ నేటికీ ఉంది. ప్రస్తుత విద్యార్థులు సైతం ఇదే ప్రయోగశాలలో భౌతిక శాస్త్ర ప్రయోగాలు చేస్తుండటం విశేషం. రామన్ జ్ఞాపకంగా భౌతిక శాస్త్ర ప్రయోగశాలను నేటికీ ఎటువంటి మార్పులు చేయకుండా వారసత్వ సంపదగా సంరక్షిస్తూ వస్తున్నారు.
ఏయూతో అనుబంధం
ఆంధ్రవిశ్వవిద్యాలయంతో సి.వి.రామన్కు ఎంతో అనుబంధం ఉంది. ఈయన వర్సిటీకి గౌరవ ఆచార్యుడిగా పనిచేశారు. పలు సందర్భాలలో ఆయన ఏయూను సందర్శించి పలు ప్రసంగాలు, బోధన జరిపారు. సి.వి.రామన్ శిష్యుడు ఆచార్య సూరిభగవతం ఏయూ భౌతక శాస్త్ర విభాగాన్ని ప్రారంభించి, తొలి విభాగాధిపతిగా నిలిచారు. ఈయనకు నిరంతరం సూచనలు ఇస్తూ వర్సిటీలో భౌతిక శాస్త్ర విభాగాన్ని దేశంలోని ప్రముఖ విభాగాల్లో ఒకటిగా తీర్చిదిద్దడంలో రామన్ కృషి ఉంది. అందుకే ఆయన స్మృతి చిహ్నంగా భౌతిక శాస్త్ర విభాగంలో రామన్ విగ్రహం ఏర్పాటు చేశారు.
రామన్ ప్రయోగశాల చూస్తారా..?
సర్ సి.వి.రామన్ జయంతిని పురస్కరించుకుని గురువారం మిసెస్ ఏవీఎన్ కళాశాలలో రామన్ జయంతి సభ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందిస్తాం. రామన్కు సంబంధించిన విశేషాలను చిన్నారులకు తెలియజేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. పాఠశాల విద్యార్థులకు గురువారం రామన్ పనిచేసిన ప్రయోగశాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నాం. తద్వారా విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడానికి వీలవుతుంది. కార్యక్రమంలో భాగంగా డీఆర్డీఏ హైదరాబాద్ డెరైక్టర్ డాక్టర్ బి.రామకృష్ణారావు కళాశాలను సందర్శించనున్నారు.
-డాక్టర్ టి.ఎల్.రాంబాబు, భౌతిక, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్సైన్స్ విభాగాధిపతి, మిసెస్ ఏవీఎన్ కళాశాల