వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలతో రాజీ డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ శాసనసభాపక్ష ఉప నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు.
సాక్షి, హైద రాబాద్: వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలతో రాజీ డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ శాసనసభాపక్ష ఉప నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. ఎన్టీఆర్ భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన విషయంలో వారు రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. సీమాంధ్ర ప్రజల భావోద్వేగాలను నినాదాలతో, ఒళ్లు వాతలు తేలేలా కొట్టుకోవటం ద్వారా సీఎం రమేష్, ఎన్. శివప్రసాద్ పార్లమెంట్కు తెలిపి గడగడ లాడించారని చెప్పారు. చంచల్గూడ జైల్లో వైఎస్ జగన్ చేస్తున్నది దొంగ దీక్షని, దానికి సోనియా గాంధీ మద్దతు ఉందని ఆరోపించారు. టీడీపీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నందుకే సాక్షి మీడియాను బహిష్కరించామన్నారు.
ఈ ప్రశ్నలకు బదులేది?
విలేకరుల సమావేశాలకు సాక్షి ప్రతినిధిని ఆహ్వానించలేదు. దీంతో వివిధ రూపాల్లో సేకరించిన మేరకు ఈ వార్తను ఇస్తున్నాం. సాక్షిని అనుమతించి ఉంటే ఈ క్రింది ప్రశ్నలు అడిగి సమాధానాలు కోరేది.
1. మీ పార్టీ ఎంపీ హరికృష్ణ రాజీనామా మాత్రమే ఆమోదం పొందింది. రాజీనామాలు చేశామని గొప్పగా చెప్పుకున్న మీ పార్టీ మిగతా ఎంపీల రాజీనామాలు ఎందుకు ఆమోదం పొందలేదు? వారు రాజీనామా చేయకుండానే చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారా?
2. దాదాపు 4 వారాలుగా సీమాంధ్ర ప్రజలు రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేస్తున్నా చంద్రబాబు ఇంటికే పరిమితమై తనకేమీ సంబంధం లేనట్టు మౌనవ్రతం పాటిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా లేఖ వెనక్కి తీసుకుంటామని బాబుతో చెప్పించే అవకాశాలున్నాయా?