నాణ్యత పేరుతో దోపిడీ | Tanduru market commission agents in the irresistible | Sakshi
Sakshi News home page

నాణ్యత పేరుతో దోపిడీ

Aug 24 2013 1:42 AM | Updated on Aug 17 2018 5:24 PM

పెసర పంట పండిం చిన రైతులు దారుణంగా మోసపోతున్నారు. మార్కెట్ యార్డులో కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు కనీస మద్దతు ధర చెల్లించకపోవడంతో ఎంతకోఅంతకు అమ్ముకుని నిరాశతో ఇంటిముఖం పడుతున్నారు.

తాండూరు, న్యూస్‌లైన్: పెసర పంట పండిం చిన రైతులు దారుణంగా మోసపోతున్నారు. మార్కెట్ యార్డులో కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు కనీస మద్దతు ధర చెల్లించకపోవడంతో ఎంతకోఅంతకు అమ్ముకుని నిరాశతో ఇంటిముఖం పడుతున్నారు. తాండూరు మార్కెట్ యార్డులో ఈనెల 13వ తేదీ నుంచి పెసర బీట్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు యార్డులో 1,349 క్వింటాళ్ల పెసర్ల్లు కొనుగోలు చేసిన వ్యాపారులు అతి కొద్ది మందికి మాత్రమే ప్రభుత్వం నిర్ధారించిన మద్దతు ధర రూ.4,400  చెల్లించారు. నాణ్యతలేదనే సాకుతో ఇష్టారాజ్యంగా ధర నిర్ణయిస్తున్నారు. రైతులకు మద్దతు ధర కల్పించి అండగా ఉంటున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం కనీసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు.
 
 యార్డులో గిట్టుబాటు ధర కాకపోయినా కనీసం మద్దతు ధరకు కూడా లభించకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. మార్కెట్ కమిటీ అధికారుల ఉదాసీనత కారణంగానే యార్డులో కొందరు కమీషన్ ఏజెంట్లు మద్దతు ధరకు మంగళం పాడుతున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. అప్పుచేసి పెట్టుబడి పెట్టిన రైతులు, నిలువ చేసుకునేందుకు వసతిలేని వారు గత్యంతరంలేక ఏజెంట్లు నిర్ణయించిన ధరకే అమ్ముకుంటున్నారు. కొనుగోళ్లు ప్రారంభమైన 13వ తేదీన ముహూర్తంగా ఆరు క్వింటాళ్ల పెసర్ల కొనుగోలు చేశారు. తర్వాత వరుసగా రెండు రోజులు యార్డులో బీట్లు నిర్వహించలేదు. తిరిగి ఈనెల 19న బీట్లు ప్రారంభించి, 20వ తేదీ వరకు కొనుగోళు జరిపారు. 21, 22వ తేదీల్లో బీట్లు జరగలేదు.
 
 తొలిరోజు నుంచి ఇప్పటివరకు యార్డులో నిర్వహించిన బీట్లలో పెసర్లకు ఒక్క 19వ తేదీన మినహా ప్రభుత్వ నిర్ధేశించిన  మద్దతు ధర ఏనాడూ పలకలేదు. ఈనెల 13న క్వింటాలుకు రూ.4,150, 19వ తేదీన రూ.4,400, 20వ తేదీన రూ.4,300, తాజాగా 23వ తేదీన  క్వింటాలుకు రూ.4,000 ధర పలికింది. శుక్రవారం జరిగిన బీట్లనే పరిశీలిస్తే క్వింటాలుకు మద్దతు ధర కన్నా రూ.400 తక్కువ ధరకు కొనుగోళ్లు జరిపారు. అయితే నామమాత్రంగా కొన్నింటిని రూ.4,600-రూ.5,000 ధరకు కొనుగోలుచేస్తూ ఎక్కువ శాతం పెసర్లను మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ ఉన్నతాధికారులు మద్దతు ధర అమలుపై శ్రద్ధ చూపకపోవడం, ప్రభుత్వరంగ సంస్థలైన మార్క్‌ఫెడ్ వంటివి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఆసక్తి చూపకపోవడంవల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది.
 
 ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని యార్డులో మద్దతు ధర అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కాగా, 19వ తేదీన రూ.4,400 ధర చొప్పున రూ.10,95,600 విలువచేసే 249 క్వింటాళ్లు, 20న రూ.4,300 ధరకు రూ.8.60లక్షల విలువ చేసే 200 క్వింటాళ్లు, 23న రూ.4వేల ధర ప్రకారం రూ.36లక్షల విలువ చేసే 900 క్వింటాళ్ల పెసర్ల కొనుగోళ్లు జరిగాయని మార్కెట్ కమిటీ అధికారులు చెప్పారు. మొత్తం ఇప్పటివరకు సుమారు రూ.55,55,600 విలువచేసే సుమారు 1,349 క్వింటాళ్ల వ్యాపారం జరిగిందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement