
ఏపీ ప్రభుత్వంపై కోర్టుకెళతా: స్వామి స్వరూపానంద
టీటీడీ ఈఓగా ఉత్తరాది వారిని నియమించడం దురదృష్టకరమని స్వామి స్వరూపానంద సరస్వతి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు ఇది పరాకాష్ఠ అని విమర్శించారు.
అమరావతి: టీటీడీ ఈఓగా ఉత్తరాది వారిని నియమించడం దురదృష్టకరమని స్వామి స్వరూపానంద సరస్వతి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు ఇది పరాకాష్ఠ అని విమర్శించారు. మాజీ ఈఓ సాంబశివరావు నిజాయితీగలవారని, అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు. సాంబశివరావును మార్చడం పనికిమాలిన ఆలోచన అని మండిపడ్డారు. తెలుగువారిని వదిలి బయటివారికి ఈఓ పోస్టు కట్టబెడుతూ టీడీపీ ప్రభుత్వం చేసిన దుస్సాహసం ఎవ్వరూ చేయలేదన్నారు.
తెలుగు చదవడం, మాట్లాడటం రానివారిని ఎలా ఈఓగా ప్రభుత్వం నియమిస్తుందని ప్రశ్నించారు. కీలక నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఆగమానికి సంబంధించి సమస్యలు వస్తాయని వివరించారు. ఉత్తర ప్రాంతం ఆగమాలతో సంబంధం లేకుండా భక్తి ఉంటుందని తెలిపారు. టీటీడీ నూతన ఈఓ నియామకంపై కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. ఇక ముందు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇలాంటి చర్యలు తీసుకోకుండా పోరాటం చేస్తానని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు కొత్త ఈవోగా ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నియమితులైన విషయం తెలిసిందే.
సంబంధిత మరిన్ని కథనాలకై చదవండి
తెలుగువారు లేరనా?!