హంద్రీ-నీవా పిల్ల కాలువలకు మోక్షం | sujala sravanthi project | Sakshi
Sakshi News home page

హంద్రీ-నీవా పిల్ల కాలువలకు మోక్షం

Feb 25 2015 3:33 AM | Updated on Sep 2 2017 9:51 PM

ఏవీఆర్ హంద్రీ-నీవా సుజలస్రవంతి ప్రాజెక్టు రెండోదశ పనుల్లో భాగంగా పిల్ల కాలువల పనులను చేపట్టేందుకు వ్యయం పెంచుతూ సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఏవీఆర్ హంద్రీ-నీవా సుజలస్రవంతి ప్రాజెక్టు రెండోదశ పనుల్లో భాగంగా పిల్ల కాలువల పనులను చేపట్టేందుకు వ్యయం పెంచుతూ సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వం రూ.550కోట్ల అదనపు నిధులు కేటాయించేందుకు సిద్ధమైంది.
 
 బి.కొత్తకోట: సీఎం రాజశేఖరరెడ్డి హయాం లో ఉపకాలువల నుంచి రైతుల పోలాల్లోకి తీసుకువెళ్లాల్సిన పిల్లకాలువ పనులను చేసేందుకు కాంట్రాక్టర్లు ఎకరాకు రూ.4,700తో ఒప్పందం చేసుకున్నారు. వీటీ ద్వారా చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో 4,04,500 ఎకరాలకు సాగునీటీని అందించాలన్నది లక్ష్యం. అయి తే కాలువ పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లు పిల్ల కాలువల పనులపై శ్రద్ధచూపించలేదు.
 
 ఈ పనులను రూ.4,700తో చేపట్టేందుకు గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు మొండికేయడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఎకరాకు రూ.10,500కు పెంచుతూ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపారు. దీనికి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం అధికారం కోల్పోయే చివరి రోజుల్లో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అధికారంలోకి వచ్చిన మొదట్లో టీడీపీ ప్రభుత్వం నిలుపుదల చేస్తూ చర్యలు తీసుకొంది. తాజాగా ప్రభుత్వం పిల్లకాలువల పనులను ఎకరాకు రూ.10,500కే పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  గత ఒప్పందం మేరకు రూ.190కోట్లతోనే పనులు జరగాలి. ఇప్పుడు మొత్తానికి పనుల వ్యయం రూ.424కోట్లకు చేరింది.  అయినప్పటికీ కాంట్రాక్టర్లు మరింత ధరను పెంచాలన్న డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు.
 
 ఇకపై పనులు రద్దే..
 ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పిల్లకాలువల నిర్మాణం, ప్యాకేజీల్లోని పనులకు ఒప్పందం విలువను పెంచింది. ఈ విషయంలో కాంట్రాక్టర్లు మళ్లీ కొత్త ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల మేరకు పెంచాలని డిమాండ్ చేస్తే చర్యలుంటాయి. పనిచేయని వాటిని రద్దుచేస్తాం. కొత్తవారికి పనులు అప్పగించే చర్యలతో ముందుకు వెళ్తాం.
 -మురళీనాధ్‌రెడ్డి, ఎస్‌ఈ, మదనపల్లె సర్కిల్
 

Advertisement
 
Advertisement
Advertisement