సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సోదరుడు రాజశేఖరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఓ యువకుడి ఆత్మహత్య కేసులో తోపుదుర్తి రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నేతల ఒత్తిడితో రైల్వే పీఎస్ నుంచి అనంతపురం రూరల్ పీఎస్కు కేసును బదిలీ చేశారు. తోపుదుర్తి రాజాపై 108 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
తోపుదుర్తి రాజాకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మరికాసేపట్లో ఆయన్ని కోర్టుకు హాజరుపరచనున్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని రాప్తాడు వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. తోపుదుర్తి ప్రకాష్రెడ్డికి ఇటీవల గన్మెన్లను తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఆయన సోదరుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖరరెడ్డి ప్రోద్భలంతోనే మహేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తోపుదుర్తి రాజాను ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు.


