పార్టీలకతీతంగా సమైక్యానికి అఫిడవిట్లు ఇవ్వాలి | submit affidavits in favour of Samaikyandhra, ys jagan mohan reddy call for mlas | Sakshi
Sakshi News home page

పార్టీలకతీతంగా సమైక్యానికి అఫిడవిట్లు ఇవ్వాలి

Dec 27 2013 2:17 AM | Updated on Jul 25 2018 4:09 PM

కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలందరూ తమ మనస్సాక్షి ప్రకారం తామంతా సమైక్యానికి కట్టుబడి ఉన్నామని, సమైక్యానికి మద్దతుగా రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

* అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు జగన్ పిలుపు
* కిరణ్, చంద్రబాబు ఏం చెప్పినా  మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలి
* రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పించాలి
* ముసాయిదా బిల్లుపై చర్చలో పాల్గొంటే విభజనకు అంగీకరించినట్లే
 * ముందుగా సమైక్య తీర్మానం చేయటం కోసం అందరూ పట్టుపట్టాలి
సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి, పార్లమెంటుకు పంపించాలి
 
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలందరూ తమ మనస్సాక్షి ప్రకారం తామంతా సమైక్యానికి కట్టుబడి ఉన్నామని, సమైక్యానికి మద్దతుగా రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏం చెప్తారన్న విషయాన్ని పక్కనపెట్టాలని సూచించారు.

‘‘వీరేం చెప్పినా.. ప్రజాప్రతినిధులంతా తమ మనస్సాక్షికి అనుగుణంగా సమైక్య రాష్ట్రం కోసం రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇవ్వాలి. అసెంబ్లీలో విభజన బిల్లును వ్యతిరేకించాలి. అప్పుడే పార్లమెంటులో మన బలం పెరుగుతుంది. కోర్టుల్లోనూ మన వాదనకు బలం చేకూరుతుంది’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజనకు ముసాయిదా బిల్లు పంపి.. దానిపై చర్చించమనటం ఏరకమైన పద్ధతి అని  ప్రశ్నించారు. బిల్లుపై చర్చలో పాల్గొనట మంటే విభజనకు అంగీకరించినట్లే అవుతుందన్నారు. ముందుగా సభ్యులంతా సమావేశమై సమైక్య తీర్మానం కోసం గట్టిగా పట్టుపట్టాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రాన్ని విడగొడితే ఏ రకమైన అన్యాయాలు జరుగుతాయో.. ఎంతటి దారుణ పరిస్థితులు ఉత్పన్నమవుతాయో తెలియజేస్తూ ఒక నోట్ విడుదల చేస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆ నోట్ ఇచ్చి, సమైక్యానికి అనుకూలంగా తీర్మానం చేయాలని గట్టిగా పట్టుపడతామని తెలిపారు. వైఎస్ జగన్ గురువారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి.. హైదరాబాద్‌లో విడిది చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అఫిడవిట్లు సమర్పించారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని.. తామిచ్చిన అఫిడవిట్లలోని ప్రతి విషయాన్నీ పరిశీలించారని చెప్పారు. ఈ సందర్భంగా జగన్ చెప్పిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

 సమైక్యం కోసం అఫిడవిట్లు సమర్పించాం...
 ‘‘మా పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు, గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో సహా.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ అఫిడవిట్లు సమర్పించాం. గతంలోఅవిశ్వాస తీర్మానం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేసి అనర్హతకు గురైన 15 మంది ఎమ్మెల్యేలలో 13 మంది మాతో పాటే విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చారు. విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచినందుకు వారు అప్పట్లో అవిశ్వాస తీర్మానానికి ఓట్లేశారు. ఆ రోజు వారిని వెంటనే అనర్హులుగా చేసి ఉంటే ఉప ఎన్నికలు జరిగి, తద్వారా గెలిచి శాసనసభలో సమైక్యానికి తోడుగా నిలబడేవారు.

అయితే ఒక కుట్రతో పథకం ప్రకారం మూడు నెలలు సాగదీసి ఆ తర్వాత అనర్హత వేటు వేశారు. సాధారణ ఎన్నికలకు ఏడాదిలోపు గడువుండగా ఈ అనర్హత వేటు వేసి.. ఆ స్థానాలకు ఉపఎన్నికలు రాకుండా కుట్ర చేశారు. ఆ విషయాలన్నింటినీ ఈ రోజు రాష్ట్రపతికి తెలియజేస్తూనే.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారంతా అఫిడవిట్లు ఇచ్చారు. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు లండన్ పర్యటనలో ఉన్నందువల్ల అఫిడవిట్ ఇవ్వలేకపోయారు. అనర్హతకు గురైన ఎమ్మెల్యే వనిత కూడా సమాచారం లేనందువల్ల అఫిడవిట్ ఇవ్వలేకపోయారు. త్వరలోనే వారివీ రాష్ట్రపతికి పంపుతాం.

వారూ మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలి
‘‘మేం చేసినట్లుగా మిగిలిన పార్టీల ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీలకతీతంగా ముందుకువచ్చి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అఫిడవిట్లు ఇవ్వాలని మిగిలిన పార్టీల ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నా. ఇలా కోరాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే.. తన పార్టీ ఎమ్మెల్యేలు అఫిడవిట్లు ఇవ్వడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కచ్చితంగా అంగీకరించరు. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సమైక్యానికి అఫిడవిట్లు ఇచ్చి, బాబు ఇవ్వకపోతే ప్రజలు ఆయనవైపు వేలెత్తిచూపుతారన్న భయంతో అఫిడవిట్లు ఇవ్వకుండా ఆయన అందరినీ ఆపే కార్యక్రమం చేస్తారు. బాబు గతంలో కూడా సమైక్యంకోసం లేఖ ఇవ్వలేదు.

ఏపీఎన్‌జీవోలు కలిసినప్పుడు సమైక్యానికి అనుకూలంగా, విభజనకు వ్యతిరేకంగా లేఖ ఇవ్వాలని బతిమిలాడితే.. ‘నేనివ్వను పో’ అని నిర్దయగా చెప్పిపంపారు. ముఖ్యమంత్రి కిరణ్ కూడా ప్రతి రోజూ ఏదో ఒకటి చెప్పి మభ్య పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఒకవైపు చర్చ జరగాలంటున్న కిరణ్.. ఇప్పుడు ఉద్యోగుల వివరాలు సమర్పించాలంటూ 56 ప్రభుత్వశాఖలకు నోట్ పంపారు. విభజనకు సంబంధించి కార్యదర్శుల స్థాయి నుంచి శాఖలన్నింటి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కిరణ్ ఏమి చెప్పినా.. బాబు ఏమి చెప్పినా.. ప్రతి ఎమ్మెల్యే వారి మనస్సాక్షిని అడగమని కోరుతున్నా. ఆ మనస్సాక్షి ప్రకారం రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చి.. తద్వారా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో తోడ్పాటునందించాలని ప్రార్థిస్తున్నా.

ఏదోలా బిల్లును ముందుకుతోయాలనే వారి తొందర
అత్యధిక ఎంపీ సీట్లు గెలిపించి కేంద్రంలో అధికారంలో కూర్చోబెడితే వాళ్లే రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగా రెచ్చగొట్టి.. ఇక కొట్టుకుచావండి అనే పద్ధతిలో నాయకత్వం ఉండకూడదు. ఒకవైపు విభజన మీద అసెంబ్లీలో చర్చ జరగాలంటారు. ఇంకొకవైపు కనీసం విభజనకు సంబంధించిన సమాచారం వీళ్ల దగ్గరలేదు. ఇంకొకళ్లకి ఇవ్వరు. సమాచారం ఇవ్వకుండానే చర్చ జరిగిపోవాలట. ఏదో ఒకటి చర్చ జరిపి, ఏదో ఒకటి చెప్పి ముందుకు తోసేయాలని ముఖ్యమంత్రి కిరణ్, స్పీకర్ మనోహర్‌లు చాలా తొందర పడుతున్నారు. యూపీ నుంచి ఉత్తరాఖండ్‌ను విడగొట్టినపుడు ఎలా చేశారన్న కనీస అవగాహన స్పీకర్‌కు ఉందా? ఉత్తరాఖండ్‌ను విడగొట్టినపుడు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాతే విభజనపై ముందుకెళ్లారు. కానీ ఇక్కడ మాత్రం అసెంబ్లీ తీర్మానం సంగతి పట్టించుకోకుండా ఏకంగా ముసాయిదా బిల్లును అసెంబ్లీకి పంపారు. అక్కడికీ, ఇక్కడికీ తేడా ఎంతుందో ఇప్పటికైనా అర్థమవుతోందా? ఈ రకంగా అడ్డగోలుగా విభజించటం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు విభజనను అడ్డుకోకపోతే చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలే కాదు స్పీకర్‌తో సహా అంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారు.

కుట్రను బట్టబయలు చేయాల్సింది పోయి...
టీడీపీతో సహా కుట్రపూరిత రాజకీయ నేతలంతా చర్చకు మొగ్గుచూపుతూ ఉన్నారు. అసలు విభజనపై సభలో అభిప్రాయం తీసుకోకుండా బిల్లుపై చర్చ జరగటంలో అర్థమేమైనా ఉందా? అసెంబ్లీలో ముందుగా తీర్మానం లేకుండా ముసాయిదా బిల్లుపై చర్చ జరగటం అంటే విభజనకు అంగీకరించినట్లు కాదా? మొదట అందరూ సమావేశమై సమైక్య తీర్మానం చేయాలి. తీర్మానం చేసిన తర్వాత దానిని కేంద్రానికి పంపాలి. అది చూసి కూడా రాష్ట్రాన్ని విడగొట్టండి అని ముసాయిదా బిల్లు పంపితే.. దానిపై చర్చ జరగాలి. కానీ.. తీర్మానం లేకుండానే విభజనకు అనుకూలంగా బిల్లు పంపిచేశారు. దానిపై చర్చించండి అని మనపై రుద్దుతూ ఉన్నారు. మన కళ్లెదుటే ఈ కుట్ర కనపడుతూ ఉంటే.. దానిని అడ్డుకోవాల్సింది పోయి, బట్టబయలు చేయాల్సింది పోయి.. మనమే నాలుగడుగులు ముందుకేసి అంగీకారం తెలిపితే ఎలా? సమైక్య తీర్మానం చేసి దానిని పార్లమెంటుకు, సుప్రీంకోర్టుకు పంపించటం ద్వారా ఈ కుట్రను అడ్డుకోవాలి.’’
 
అంత ‘గొప్ప’ మనస్తత్వం ఆ పత్రికకే ఉంది...
‘‘అసలు ఏపీఎన్‌జీవో అనేది ఒక ఉద్యోగుల సంఘం. మొత్తం 800 ఓట్లు. పులివెందులలో 4 ఓట్లు ఉన్నాయి. అందులో మీరు రాజకీయాలు చూపిస్తారు. ఆంధ్రజ్యోతిలో రాస్తారు.. అసలు ఒక తరంగా...ని పేపర్ అది. ‘జగన్‌కు ఝలక్...’ అట. (ఆ పత్రిక ప్రతినిధిని ఉద్దేశించి) వాహ్వా.. ఏమి హెడ్డింగ్ పెట్టావయ్యా! పులివెందులలో మొత్తం రెండు లక్షల ఓట్ల ప్రజానీకానికి సంబంధించి నాలుగు ఓట్లకు తెచ్చారు. అక్కడా రాజకీయం చేయదల్చుకున్నారు. ఎవరి గురించైతే పత్రికలో రాశారో అదే దుర్గాప్రసాద్ విలేకరుల సమావేశం పెట్టి ఆంధ్రజ్యోతి పేపర్‌ను కడిగేశారు. వైఎస్ కుటుంబానికి పూర్తిగా విధేయులుగా ఉన్నామని చెప్పారు.

అసలు ఏపీఎన్‌జీవో అనేది ఉద్యోగుల సంఘం. వాళ్ల ఎన్నికలు వాళ్లు చేసుకుంటున్నారు. అందులో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు.. అనే విషయాలతో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నా స్థాయిలో ఉన్న వ్యక్తికి పనేముంటుంది? నాకు తెలిసినంత వరకూ ఏ రిజిస్టర్డ్ పార్టీ కూడా ఈ రకంగా 800 ఓట్లు ఉన్న ఒక ఉద్యోగ సంఘం రాజకీయాలను పెద్దది చేయాలని అనుకోదు. ఇలాంటి వాటిలో కూడా రాజకీయాలు చేయాలనే గొప్ప మనస్తత్వం ఎవరికైనా ఉందంటే అది ఒక్క ఆంధ్రజ్యోతి దినపత్రికకు, ఇంకా ఏబీఎన్ అనే చానల్‌కు మాత్రం ఉంది.’’ (మీడియా సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా జగన్ పై విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement