సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 83వరోజూ సీమాంధ్ర జిల్లాల్లో ఉధృతంగా సాగింది. పలు జిల్లాల్లో భారీవర్షాలను సైతం లెక్కచేయక జనం రోడ్లపైకి వచ్చి సమైక్యనినాదాలు మార్మోగించారు.
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 83వరోజూ సీమాంధ్ర జిల్లాల్లో ఉధృతంగా సాగింది. పలు జిల్లాల్లో భారీవర్షాలను సైతం లెక్కచేయక జనం రోడ్లపైకి వచ్చి సమైక్యనినాదాలు మార్మోగించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్లో రైతాంగ సమాఖ్య ఆధ్వర్యంలో రైతుగర్జన నిర్వహించారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో నాన్పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. భీమవరం ప్రకాశం చౌక్లో విద్యార్థులు మానవహారంగా నిలబడ్డారు. చిత్తూరు జిల్లా పుంగ నూరులో ఆర్టీసీ కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు.
వీఆర్వోలు మురళి, రామకృష్ణ గోనెసంచుల్లో తలలు మాత్రం కనపడే విధంగా నిలబడి రాయలసీమ, కోస్తాంధ్ర ఫ్లకార్డులతో వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతపురంలో భారీ ర్యాలీ చేపట్టి, టవర్ క్లాక్ వద్ద కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను దహనం చేశారు. కృష్ణాజిల్లా జేఏసీ పిలుపు మేరకు చల్లపల్లిలో విద్యార్థులు, అవనిగడ్డలో ఎస్టీలు, కోడూరులో వ్యాయామ ఉపాధ్యాయులు దీక్షలు చేశారు. కర్నూలులో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడించారు. జిల్లా వైద్య, ఆరోగ్య, రోడ్డు భవనాల శాఖల ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. ఆళ్లగడ్డ, డోన్లలో విద్యార్ధినీ, విద్యార్థినులు ర్యాలీలు నిర్వహించారు.