కొత్త బస్సులొస్తున్నాయ్.. | RTC new bus's in city rodas | Sakshi
Sakshi News home page

కొత్త బస్సులొస్తున్నాయ్..

Nov 18 2013 12:50 AM | Updated on Aug 20 2018 9:16 PM

ఆర్టీసీకి కొత్త బస్సులు వస్తున్నాయి. కేంద్రప్రభుత్వ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకాన్ని పొడగించి రవాణా వ్యవస్థపై దృష్టి సారించాలని భావిస్తోంది.

సాక్షి, విజయవాడ : ఆర్టీసీకి కొత్త బస్సులు వస్తున్నాయి. కేంద్రప్రభుత్వ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకాన్ని పొడగించి రవాణా వ్యవస్థపై దృష్టి సారించాలని భావిస్తోంది. ఈ పథకంలో భాగంగా మరో రెండు నెలల్లో ఆర్టీసీకి 90 కొత్త బస్సులు రానున్నాయి. 25 మెట్రో డీలక్స్ బస్సులు, మరో 65 సిటీ ఆర్డనరీ బస్సులని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విజయవాడలో 495 బస్సులు ఉన్నాయి. వీటిలో కాలం చెల్లినవి 40 ఉన్నా అవసరాల దృష్ట్యా కొనసాగిస్తున్నారు. కొత్తవి రాగానే వాటిని తీసివేసి కొత్త రూట్లలో వీటిని నడుపుతారని తెలుస్తోంది.
 
జేఎన్‌ఎన్యూఆర్‌ఎం పథకంలో భాగంగా

జేఎన్‌ఎన్యూఆర్‌ఎం పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ బస్సులను కేటాయిస్తోంది. వీటికి అయ్యే వ్యయంలో  50శాతం కేంద్రం, 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 30 శాతం ఆర్టీసీ భరిస్తుంది. ఒకొక్క బస్సు సుమారుగా రూ.30 లక్షలు నుంచి రూ.45 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం కింద నగరానికి 213 బస్సులు వచ్చాయి. తర్వాత వీటి మంజూరును ఆపేశారు. ఈ పథకాన్ని పొడిగించి, దేశంలోని కొన్ని ప్రధాన నగరాలకు కొత్త బస్సులు మంజూరు చేస్తున్నట్లు సమాచారం.
 
గుదిబండగా మారిన ‘సీఎన్‌జీ’

ఆర్టీసీలో 313 సీఎన్‌జీ బస్సులు ఉన్నాయి. వీటిలో 213 ఎన్యూఆర్‌ఎం కింద వచ్చినవే. గ్యాస్ కొరత, మరోవైపు బస్సు టైర్లు మన్నిక తగ్గడం, బస్సు నిర్వహణ కూడా పెరగడంతో ఇవి ఆర్టీసీకి గుదిబండగా మారాయి. ఈ సారి ఇచ్చే మెట్రో బస్సులు సీఎన్‌జీ కాకుండా డీజిల్ మాత్రమే కావాలంటూ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పినట్లు తెలిసింది.
 
మెట్రో బస్సుల నాణ్యత ప్రశ్నర్థకమే

మెట్రో బస్సుల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది.  20 బస్సుల చొప్పున వాటిని మరమ్మతులకు పంపుతున్నారు. ఈ సారి వచ్చే బస్సులపై జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. బస్సుల నాణ్యత పెంచాలంటూ అధికారులు ఆ కంపెనీకి చెప్పినట్లు తెలిసింది.
 
కొత్త రూట్ల కోసం అన్వేషణ

వచ్చే బస్సులను కొత్త రూట్లలో తిప్పే అవకాశం ఉంది. జక్కంపూడి, గొల్లపూడి, అంబాపురం సమీపంలో కొత్తగా కాలనీలు ఏర్పడుతున్నాయి. ఆ కాలనీలోకు బస్సుల అవశ్యకతపై ఇప్పటికే అధ్యయనం చేస్తున్నారు. అవసరాన్ని బట్టి సర్వీసులు నడపాలని అధికారులు భావిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement